ఫత్వా... వెరీ ఇంటరెస్టింగ్: పాతబస్తీలో ఓటింగ్ తగ్గడానికి కారణం ఇదేనా?
హైదరాబాద్: డిసెంబర్ 7వ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా 73.20 శాతం ఓటింగ్ నమోదయింది. ఈసీ దీనిని దాదాపు ఒకరోజు గడిచిన తర్వాత తేల్చింది. చాలా నియోజకవర్గాల్లో 90 శాతం కంటే ఎక్కువగా ఓటింగ్ జరిగింది. ఎక్కువ ప్రాంతాల్లో డెబ్బై, ఎనబై శాతం కంటే ఎక్కువే జరిగింది. హైదరాబాదులో మాత్రం ఓటింగ్ చాలా దారుణంగా ఉంది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
దీనికి తోడు తెలంగాణవ్యాప్తంగా లక్షలాది ఓట్లు గల్లంతయ్యాయి. ఈ విషయంలో ఈసీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెరాసకు వ్యతిరేకంగా ఉన్నవారి ఓట్లు తీసేశారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇక పాతబస్తీలో కూడా దారుణంగానే ఓటింగ్ నమోదయింది. ముషీరాబాద్ 51 శాతం, మలక్పేటలో 42, అంబర్ పేటలో 55, ఖైరతాబాద్లో 53, జూబ్లీహిల్స్లో 45, సనత్ నగర్లో 52, నాంపల్లిలో 44, కార్వాన్లో 51, గోషామహల్లో 58, చార్మినార్లో 40, చాంద్రాయణగుట్టలో 46, యాకుత్పురాలో 41, బహదూర్ పురలో 50, సికింద్రాబాద్లో 49, కంటోన్మెంట్లో 48 శాతం ఓటింగ్ నమోదయింది.
పాతబస్తీ ప్రత్యేకం
తెలంగాణలో జరిగే ఎన్నికల్లో పాతబస్తీ ఎప్పుడూ ప్రత్యేకమే. మిగిలిన చోట్ల పోలింగ్ ఓ ఎత్తయితే పాతబస్తిలో ఓటింగ్ మరో ఎత్తు. పాతబస్తిలో ఓటింగ్ తగ్గడానికి పలు కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. గతంలో కంటే పోలింగ్ పడిపోయింది. పాతబస్తీలో ఓటింగ్ తగ్గడానికి మజ్లిస్ పైన వ్యతిరేకతనా, బోగస్ ఓట్లు తగ్గాయా లేక అంతకుమించి కారణం ఏమైనా ఉందా అని విశ్లేషిస్తున్నారు.
ఓ సంస్థ ఫత్వా
కొద్ది రోజుల క్రితం జామియా నిజామియా అనే సంస్థ ఓ ఫత్వా జారీ చేసింది. బోగస్ ఓట్లు వేసేవారు హరామీలు అని ప్రకటించింది. అంటే పాపాత్ములు అని అర్థం. వారిని దేవుడు క్షమించడని పేర్కొంది. అరబ్ దేశాల్లో ఇలాంటి ఫత్వాలు పాటిస్తారు. ఇప్పుడు పాతబస్తీలోను ఇదే ఫత్వా కారణంగా ఓటింగ్ తగ్గిందనే వాదనలు వినిపిస్తున్నాయి.
బురఖా చాటున బోగస్ ఓట్ల ఆరోపణలు
పాతబస్తీలో విధుల్లో పాల్గొనడం కత్తిమీద సాము. మహిళలు బురఖా వేసుకుంటారు. పరాయి మగవాళ్లు చూడకూడదనే నిబంధన ఉంది. దీనిని అడ్డు పెట్టుకొని బురఖా చాటున చాలా బోగస్ ఓట్లు వేసేవారనే వాదనలు ఉన్నాయి. ఇప్పుడు అవి తగ్గాయని అంటున్నారు. తాజాగా, జరిగిన ఎన్నికల్లోను బురఖా చాటున చాలామంది పురుషులు ఓటు వేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. కానీ అవి తగ్గాయని చెబుతున్నారు.
మజ్లిస్ పార్టీ ఆందోళన
ఓటింగ్ తగ్గడంపై మజ్లిస్ పార్టీ కూడా ఆందోళన చెందుతోందని తెలుస్తోంది. పలుచోట్ల మజ్లిస్ పార్టీ పైన వ్యతిరేకత ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తంగా ఎడు చోట్ల తమకు తిరుగుండదని మజ్లిస్ భావించినప్పటికీ ఓటింగ్ శాతం తగ్గడం వారిని కలవరానికి గురి చేస్తోందట. అది వారిపై వ్యతిరేకత, దానికి తోడు బోగస్ ఓట్లు తగ్గడమే కారణమని అంటున్నారు.