వారికి టెస్టులు ఎందుకు చేయడం లేదు: కరోనా విజృంభిస్తున్న వేళ కేసీఆర్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్
హైదరాబాదు: తెలంగాణ హైకోర్టు కేసీఆర్ సర్కార్కు షాక్ ఇచ్చింది. కరోనావైరస్ లక్షణాలతో మృతి చెందిన వారికి టెస్టులు ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించింది. ఇకపై మృతి చెందిన వారికి కూడా కోవిడ్-19 టెస్టులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం నివేదించిన నివేదికపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. తెలంగాణ జనసమితి ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్ రావు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)ను గురువారం విచారణ చేసింది హైకోర్టు.
మరణించిన వారి నుంచి కోవిడ్-19 టెస్టుల కోసం శాంపిల్స్ సేకరించొద్దంటూ రాష్ట్ర మెడికల్ మరియు హెల్త్ డైరెక్టర్ జారీ చేసిన ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలు చేయడం జరిగింది. పిటిషనర్ తరపున వాదనలు వినిపించిన న్యాయవాది ప్రభాకర్ కోర్టు ముందు పలు అంశాలను ప్రస్తావించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు ఐసీఎంఆర్ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం మృతి చెందిన వారి నుంచి కోవిడ్-19 కోసం శాంపిల్స్ సేకరణ చేయరాదంటూ ఎక్కడా లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
అంతేకాదు ప్రతి వ్యక్తికీ టెస్టులు చేయడం, గుర్తించడం, ఐసొలేషన్కు పంపడం ఆ తర్వాత చికిత్స అందించడం వంటి అంశాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పినట్లు ధర్మాసనంకు తెలిపారు ప్రభాకర్. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం హైదరాబాదు నగరంలోని కంటెయిన్మెంట్ జోన్లలో నివాసం ఉంటున్నవారికి టెస్టులు చేద్దామన్న ఆలోచన చేయడం లేదని చెప్పారు.
ఇక టెస్టులు పెద్ద సంఖ్యలో చేయకపోతే వైరస్ను డిటెక్ట్ చేయడం కష్టతరం అవుతుందని చెప్పారు. దీంతో అది మూడవ స్టేజ్కు చేరుకునే అవకాశం ఉందని కోర్టుకు తెలిపారు. ఇదే జరిగితే ఇక ఈ మహమ్మారిని ఎవరూ అడ్డుకోలేరని వెల్లడించారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు కర్నూలు జిల్లాల్లో మృతి చెందిన డాక్టర్ల విషయం ప్రస్తావించారు. వారు మృతి చెందిన తర్వాత చేసిన పరీక్షల్లో వారికి కరోనా పాజిటివ్గా తేలిందన్న విషయాన్ని కోర్టుకు గుర్తు చేశారు న్యాయవాది ప్రభాకర్.
ఇరు పక్షాల తరపున వాదనలు విన్న హైకోర్టు కేసును ఈ నెల 26కు వాయిదా వేసింది. అదే సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు ఐసీఎంఆర్ గైడ్లైన్స్ను తప్పకుండా పాటించాలని ప్రభుత్వానికి సూచించింది. మరోవైపు కోవిడ్-19 నివారణకు కేంద్ర చేపడుతున్న చర్యలను కూడా ఒక నివేదిక రూపంలో తమ ముందు ఉంచాలని ధర్మాసనం ఆదేశించింది.