హోంమంత్రి, డిప్యూటీ స్పీకర్ను ఎందుకు గాంధీలో చేర్చలే: కేసీఆర్కు రాజాసింగ్ ప్రశ్న
తెలంగాణ సీఎం కేసీఆర్పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. కరోనా సోకిన ఎవరైనా ఒక్కటేనని, అందరికీ సమాన న్యాయం చెప్పిన మాటలను గుర్తుచేశారు. కానీ ఇప్పుడు ప్రజలు, నిరుపేదలు గాంధీలో చికిత్స తీసుకుంటే.. మీ మంత్రులు, డిప్యూటీ స్పీకర్కి మాత్రం ఎందుకు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారని ప్రశ్నించారు. అంటే ప్రజలకో న్యాయం.. ప్రజా ప్రతినిధులకో న్యాయమా అని ప్రశ్నించారు.
తొలుత ప్రైవేట్ ఆస్పత్రుల్లో పరీక్షలు కాదే ట్రీట్మెంట్ ఇవ్వబోమని కేసీఆర్ చెప్పారు. కానీ హోంమంత్రి మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, బాజిరెడ్డి గోవర్దన్, బిగాల గణేశ్ గుప్తా ఎందుకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో చేరారని ప్రశ్నించారు. వారిని గాంధీ ఆస్పత్రిల్లో చేర్చి.. చికిత్స అందిస్తే సరిపోయేది కదా అని నిలదీశారు. గాంధీ సర్కార్ దవాఖానపై మీకు నమ్మకం లేదా... లేక మీ ప్రజాప్రతినిధులకు లేదా అని అడిగారు.
ఇతర రాష్ట్రాలు రోగులకు మంచి వైద్యం అందిస్తున్నాయని రాజాసింగ్ తెలిపారు. అన్నీ వసతులు కల్పిస్తున్నాయని తెలిపారు. కానీ తెలంగాణలో నాలుగు కోట్ల మంది ప్రజలకు ఒక గాంధీ ఆస్పత్రి దిక్కుగా మారిందన్నారు. సీఎం కేసీఆర్ ఫాం హౌస్లో ఉండకుండా.. బయటకొచ్చి ప్రజల పరిస్థితులను చూడాలని కోరారు. ప్రజలను చంపకండి అంటూ హితవు పలికారు. పేదలు చనిపోతే వారి మృతదేహం కూడా లభించని పరిస్థితి నెలకొందన్నారు.