65 నెలల్లో లక్షల కోట్ల అప్పు.. ఆర్టీసీ అప్పు ఎందుకు తీర్చలే... కేసీఆర్కు విపక్ష నేతల ప్రశ్న
ఆర్టీసీ కార్మికులతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరుపాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం డిమాండ్ చేశారు. హైకోర్టు సూచనను ప్రభుత్వం గౌరవించాలని సూచించారు. చర్చలకు ఆహ్వానించి.. సమస్యను పరిష్కరించాలని కోరారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ, విపక్ష నేతల సమావేశం జరిగింది. సమావేశంలో టీజేఎస్ సహా కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, ఎమ్మార్పీఎస్ నేతలు పాల్గొన్నారు.
సమ్మెకు మద్దతు..
ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా చేపట్టిన నిరసన కార్యక్రమాలతో అంతా పాల్గొనాలని సమావేశంలో నేతలు పిలుపునిచ్చారు. ఆర్టీసీని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని కోదండరాం అన్నారు. ఇందుకోసం పోరాడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించారు.
లక్ష కోట్ల అప్పులు
ఆర్టీసీ కార్మికుల నిరసన కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత వీ హెచ్ తెలిపారు. సమస్య పరిష్కారమయ్యే వరకు కార్మికులకు అండగా నిలుస్తామని చెప్పారు. 65 నెలల కేసీఆర్ పాలనలో రూ. లక్ష కోట్ల అప్పులు తెచ్చారే తప్ప ఆర్టీసీ అప్పులు తీర్చలేదని టీడీపీ నేత రమణ ఆరోపించారు. ఆర్టీసీ అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు.
మరో నిజాం..
కేసీఆర్ మరో నిజాం అని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. హైకోర్టు మొట్టికాయలు వేసినా బుద్ధిరాలేదని పేర్కొన్నారు. ఆర్టీసీ ఆస్తులను అమ్ముకొని సొంత ఆస్తులను పెంచుకుంటున్నారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని కూడా ధిక్కరించడం సరికాదని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. కోర్టుల సూచనలను కూడా పరిగణలోకి తీసుకోకపోవడం సరికాదన్నారు. లోటు బడ్జెట్ ఉన్న ఏపీ ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయగా .. తెలంగాణ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.
సంపూర్ణ మద్దతు
ఆర్టీసీని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని బీజేపీ నేత జితేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ కార్మికులకు జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని స్పష్టంచేశారు. కార్మికుల డిమాండ్లు న్యాయబద్దమైనవని గుర్తుచేశారు. కార్మికుల సమ్మెకు బీజేపీ సంపూర్ణంగా మద్దతు ఇస్తోందని తెలిపారు.