పాతబస్తీలో అభివృద్ది ఏది.. ప్రభుత్వ పథకాలు అక్కడికి ఎందుకు చేరడం లేదు.. నిలదీసిన స్మృతీ ఇరానీ...
హైదరాబాద్ పాతబస్తీ ఎందుకు అభివృద్ధి కావడం లేదని కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వ పథకాలన్నీపాతబస్తీకి ఎందుకు చేరడం లేదని నిలదీశారు. లా అండ్ ఆర్డర్ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందన్న స్మృతీ ఇరానీ... ఎంఐఎం నేతలపై వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం ఎందుకు విచారణ జరిపించట్లేదని ప్రశ్నించారు.టీఆర్ఎస్-ఎంఐఎం కలిసి రాజకీయ డ్రామా అడుతున్నాయని మండిపడ్డారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం (నవంబర్ 25) స్మృతీ ఇరానీ హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో మాట్లాడారు.
కేసీఆర్ను గెలిపిస్తే హైదరాబాద్ క్షేమం... వరదలు ఎవరూ ఆపలేరు... జీహెచ్ఎంసీ ఎన్నికలపై పోసాని
దుబ్బాక ఉపఎన్నికతో తేలిపోయిందని...
టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజల మద్దతు లేదని... దుబ్బాక ఉపఎన్నికతో ఆ విషయం తేటతెల్లమైందని స్మృతీ ఇరానీ అన్నారు. అవినీతి, అవకాశవాద పొత్తు వల్ల హైదరాబాద్ వరదల్లో మునిగిపోయిందని విమర్శించారు. వరదల కారణంగా నగరంలో 80 మంది మృతి చెందారని.. ఇంత జరిగినా ఇప్పటివరకూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఫైనల్ మెమోరాండం ఇవ్వలేదన్నారు. గడిచిన ఐదేళ్లలో జీహెచ్ఎంసీ పరిధిలో రూ.65వేల కోట్లు ఖర్చు చేసినట్లు టీఆర్ఎస్ అబద్దాలు చెబుతోందని విమర్శించారు.
రోహింగ్యాలకు ఓటు హక్కు?
అక్రమ చొరబాటుదారులకు, రోహింగ్యాలకు హైదరాబాద్లో ఓటు హక్కు ఎందుకు కల్పించారని స్మృతీ ఇరానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రోహింగ్యాలు,బంగ్లాదేశీయులకు ఏ నిబంధనల మేరకు ఓటు హక్కు కల్పించారని నిలదీశారు. హైదరాబాద్లో అక్రమంగా నివసిస్తున్న విదేశీయుల గురించి టీఆర్ఎస్,మజ్లిస్ పార్టీలు ఎందుకు మాట్లాడట్లేదని మండిపడ్డారు. దాదాపు 75వేల మంది విదేశీయులు హైదరాబాద్లో అక్రమంగా ఎలా నివసించగలుగుతున్నారని ప్రశ్నించారు. రోహింగ్యాలకు ఓటు హక్కుపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
పారదర్శక పాలన కోసం బీజేపీని గెలిపించాలని...
ఎంఐఎం-టీఆర్ఎస్ కలిసి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాయని స్మృతీ ఇరానీ ఆరోపించారు. హైదరాబాద్ మహానగరంలో 75 వేల అక్రమ నిర్మాణాలు ఎలా జరిగాయని ప్రశ్నించారు. టీఆర్ఎస్ కుటుంబ పాలనపై బీజేపీ చార్జిషీట్ విడుదల చేస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు స్పందించలేదని నిలదీశారు. పారదర్శక పాలన కోసం గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో బీజేపీ ముందుకు వెళ్తోందన్నారు. తెలంగాణలో టెక్నికల్ టెక్స్ టైల్ ప్రాజెక్టు కోసం కేంద్రం రూ.1000 కోట్లు ఇచ్చిందన్నారు. బీజేపీని గెలిపిస్తే హైదరాబాద్ను అన్ని విధాలా అభివృద్ది చేస్తామన్నారు.