తలసాని రాజీనామాపై మర్రి నిలదీత, అందరి ఫోన్లు ట్యాప్: ఎర్రబెల్లి బాంబు
హైదరాబాద్: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామాను సభాపతి వెంటనే ఆమోదించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు మర్రి శశిధర్ రెడ్డి, డికె అరుణలు శుక్రవారం డిమాండ్ చేశారు. తలసాని రాజీనామా ఆమోదించాలని కోరుతూ మర్రి, ఎమ్మెల్యే సంపత్లు సభాపతిని కలిశారు.
అనంతరం విలేకరుతో మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి రాజీనామాను లోకసభ సభాపతి ఆమోదించినప్పుడు ఇక్కడ తలసాని రాజీనామాను ఎందుకు ఆమోదించడం లేదని ప్రశ్నించారు. ఇంత సమయం ఎందుకు తీసుకుందని ప్రశ్నించారు.
తలసాని రాజీనామాను ఆమోదించకపోవడం సరికాదన్నారు. రాజీనామా ఆమోదం అనైతికం, తప్పని సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నాయని చెప్పారు. తలసాని రాజీనామా పైన సభాపతి తాత్సారం ఎందుకు చేస్తున్నారని డికె అరుణ ప్రశ్నించారు.
కెసిఆర్ రాజీనామా చేయాలి: ఎర్రబెల్లి
ఫోన్ ట్యాపింగ్ చేసి తెలంగాణ ప్రజల గౌరవాన్ని కెసిఆర్ ప్రభుత్వం మంటగలిపిందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర రావు విమర్శించారు. ప్రజలకు కెసిఆర్ క్షమాపణ చెప్పి, రాజీనామా చేయాలన్నారు. ఫోన్ ట్యాపింగ్తో తెలంగాణ ఆత్మగౌరవం మంటగలిపారన్నారు.
ఇప్పటికే అన్ని పార్టీల నేతలు ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదులో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారన్నారు. వరంగల్ పార్లమెంటు సీటుపై బిజెపితో చర్చిస్తున్నామని, తాము పోటీ చేద్దామనుకుంటున్నామని, బిజెపి కూడా అడుగుతోందన్నారు. కెసిఆర్ పాలన తీరుకు వ్యతిరేకంగా ఆగస్టు 5న వరంగల్లో ఒకరోజు దీక్ష చేస్తామన్నారు.