ఏపీ రెడ్లలా తెలంగాణా రెడ్లు సక్సెస్ కాలేదు... కాంగ్రెస్ నేత దామోదర రాజనర్సింహ షాకింగ్ కామెంట్
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ రెడ్డి సామాజిక వర్గం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ లోని రెడ్డి సామాజిక వర్గం సక్సెస్ అయినట్లుగా తెలంగాణలోని రెడ్డి సామాజిక వర్గం రాజకీయంగా సక్సెస్ కావడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక ఏపీలో ఏకంగా జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తీరు చూసైనా తెలంగాణలోని రెడ్లు చాలా విషయాలు నేర్చుకోవాలని ఆయన పేర్కొన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పుడు కూడా రాజకీయంగా సక్సెస్ అయింది రాయలసీమ రెడ్లు అని తెలంగాణ రెడ్లు రాజకీయంగా చాలా వెనుకబడి ఉన్నారని దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు . ఇక ఈ విషయం ఆ సామాజిక వర్గ నేతలు చాలా సందర్భాల్లో పేర్కొన్నప్పటికీ ప్రస్తుతం దామోదర రాజనర్సింహ పేర్కొనడం మాత్రం ఆసక్తికరంగా మారింది. ఇక ఈ విషయం అటుంచితే టీపీసీసీ చీఫ్ గా తనకు అవకాశం ఇస్తే తను స్వీకరిస్తానని, అందుకు తను సమర్థుడనని చెప్పుకున్నారు దామోదర. తెలంగాణలో కాంగ్రెస్ బాగుపడాలంటే, బలోపేతం కావాలంటే అధిష్టానం ఆలోచనా ధోరణి మారాలని దామోదర రాజనర్సింహ అభిప్రాయపడ్డారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయకపోతే, ప్రజా ఉద్యమాలు నిర్మించకపోతే ఉనికి ప్రశ్నార్థకం కాక తప్పదని ఆయన పేర్కొన్నారు.
Recommended Video
ఒకపక్క బిజెపి కూడా తెలంగాణ రాష్ట్రంలో కిషన్ రెడ్డి వంటి నేతకు హోం శాఖ సహాయ మంత్రి పదవి నిచ్చి టిఆర్ఎస్ పార్టీని భయపెడుతుంది అన్నారు రాజనర్సింహ. ఇక కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ ని ఎదుర్కొనేందుకు ఎలాంటి ప్రయత్నమూ చేయలేకపోతోందని ఆయన అన్నారు. దళిత నేత అయిన దామోదర రాజనర్సింహ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం తెలంగాణ రెడ్డి సామాజిక వర్గం నేతల్లో కాస్త బలమైన ఆకాంక్షను రగిలించి వారికి వ్యతిరేకంగా బలమైన వర్గంగా ఎదిగేలా చేయడమా లేక కాంగ్రెస్ పార్టీలోని రెడ్డి సామాజిక వర్గ నేతలను బీజేపీ ఆపరేషన్ కమల అంటున్న నేపథ్యంలో వారితో ఎలాంటి ప్రయోజనం ఉండదని పరోక్షంగా బిజెపికి చెప్పడమా అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం దామోదర రాజనర్సింహ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.