కరోనా వేళ ఇంత తొందరెందుకు.. నలుగురు ఐఏఎస్లతో విచారణ అవసరమా.. తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్
రాష్ట్రంలో ఓవైపు కరోనా ఉధృతి కొనసాగుతుంటే... మరోవైపు రాజకీయ నేతలపై భూకబ్జా ఆరోపణలు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. కరోనా సంక్షోభ కాలంలో ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా ఈ భూముల పంచాయతీలను ముందు పెట్టుకోవడమేంటన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా హైకోర్టు కూడా ఇదే విషయంలో ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా విపత్తు వేళ భూకబ్జా దర్యాప్తుపై అంత తొందరెందుకు అని ప్రశ్నించింది. దేవరయాంజల్లో ఆలయ భూముల కబ్జా ఆరోపణలపై శనివారం(మే 8) హైకోర్టు విచారణ చేపట్టింది.
కరోనా వేళ నలుగురు ఐఏఎస్లో విచారణ అవసరమా?
దేవరయాంజల్ భూములపై ఎప్పటినుంచో వివాదం నెలకొందని... అలాంటప్పుడు వాటిపై దర్యాప్తుకు ఇప్పుడే అంత తొందర ఎందుకు అని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కరోనా విజృంభిస్తున్న వేళ నలుగురు ఐఏఎస్లతో దేవరాయంజల్ భూములపై విచారణ అవసరమా అని నిలదీసింది. కరోనాతో పేషెంట్లు పిట్టల్లా రాలిపోతుంటే లేని స్పందన... దీనిపై మాత్రమే ఎందుకని మండిపడింది. కేవలం పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా విచారణకు జీవోలు ఇవ్వడమేంటని ప్రశ్నించింది.
అడ్వకేట్ జనరల్ రియాక్షన్...
హైకోర్టు ప్రశ్నలకు ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ స్పందిస్తూ... ప్రభుత్వం నియమించిన కమిటీ ప్రాథమిక విచారణ మాత్రమే చేస్తుందని తెలిపారు. ఆ స్థలాల్లో నుంచి ఎవరినీ ఖాళీ చేయించటం, ఆక్రమించటం లేదని వెల్లడించారు. కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఇప్పుడే కూల్చివేత వంటి చర్యలు ఉండవని తెలిపారు. ఏజీ వ్యాఖ్యలపై హైకోర్టు స్పందిస్తూ... ప్రాథమిక విచారణకైనా చట్ట ప్రకారం నోటీసులు ఇవ్వాలని సూచించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్నవారికి నోటీసులు ఇచ్చి... స్పందించేందుకు తగిన సమయం ఇచ్చిన తర్వాతే విచారణకు దిగాలని స్పష్టం చేసింది.
కమిటీకి సహకరించాలని హైకోర్టు ఆదేశం...
భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు విచారణ కమిటీకి సహకరించాలని హైకోర్టు ఆదేశించింది. వారి నుంచి వివరణ తీసుకున్న తర్వాతే ప్రభుత్వానికి కమిటీ నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. పిటిషనర్ల భూముల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాలో కౌంటర్ దాఖలు చేయాలని దేవాదాయ శాఖను ఆదేశించింది. దేవర యంజాల్ భూములపై విచారణకు ప్రభుత్వం నలుగురు ఐఏఎస్ అధికారులతో కమిటీ వేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఈ నెల 3న జారీ చేసిన జీవో 1014ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
దేవరయాంజల్ భూముల వివాదం
దేవరయాంజల్లో మాజీ మంత్రి ఈటల రాజేందర్,ఆయన బంధువులు భూకబ్జా ఆరోపణలకు పాల్పడినట్లుగా ఇటీవల ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. మెదక్ జిల్లాలోని మాసాయిపేట మండలంలో అసైన్డ్ భూముల కబ్జా వ్యవహారం తర్వాత ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనిపై ప్రభుత్వం ఆగమేఘాల మీద విచారణకు ఆదేశించింది. అయితే ఇవే దేవరయాంజల్ భూముల్లో మంత్రులు మల్లారెడ్డి,కేటీఆర్లకు కూడా భూములు ఉన్నాయని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈటల పేరును బయటపెట్టినవాళ్లు వీళ్ల పేర్లు మాత్రం ఎందుకు దాస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. దేవరయాంజల్లో ఆ ఇద్దరు మంత్రులకు చెందిన భూములపై కూడా విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేస్తున్నారు.