తెలంగాణలో 'పాట' చిన్నబోయింది: నాలుగేళ్లయినా రాష్ట్ర గేయం ఎందుకు లేదు?
Recommended Video
హైదరాబాద్: బాధనైనా.. సంబురాన్నైనా.. గుండె నుంచి గొంతులకు ఒంపుకున్నది తెలంగాణం. ఆ గొంతులు నెత్తురసొంటి పాటలను గానం చేసినయి. జంగు సైరన్ అయి కొట్లాటకు నెగడు రాజేసినయ్.. దు:ఖశీలిన గుండెలకు కొత్త ఊపిరి పోసినయ్. అందుకే పాటకు తెలంగాణ శిగమూగింది.. కండ్ల నీళ్లు తుడుసుకుని ఢిల్లీకి కవాతు చేసింది.
ఈ నేల మీద ఏ గుండెను అలుముకున్నా దాని గోస లయకార శబ్దమై వినిపిస్తది. సామూహిక గాన క్షేత్రమై పోరు చరిత్రను ఎరుక చేస్తది. పాట గురించి చెప్పాలన్నా.. మళ్లీ ఓ కొత్త పాటే పుట్టుకొస్తది. పాటతో తెలంగాణది పేగుబంధం. కానీ ఇప్పుడెందుకో ఆ పాట చిన్నబోయింది?.. దాని కంటి రెప్పల కింద చిన్న తడి మెరుస్తాంది.. కానీ కానొచ్చేది ఎందరికీ?
జూన్ 2, 2018. తెలంగాణ నాలుగో అవతరణ దినోత్సవ వేడుకులకు సర్కార్ సిద్దమవుతున్న సందర్భం. నాలుగేళ్లు గడిచిపోయినయ్. అయినా తెలంగాణకు ఇంతవరకు రాష్ట్ర గేయం లేదు. మా తెలుగు తల్లికి బదులు 'జయ జయహే తెలంగాణ' అంటూ తెలంగాణ పాడుకున్న పాట పాలకులకు అంటరానిదైంది. ఉద్యమ సమయంలో సబ్బండ వర్ణాలను ఏకం చేసిన ఆ పాట ఆ తర్వాత పాలకుల కళ్లకు అంత ఇంపుగా కనిపించలేదు.
తెలంగాణ 31 జిల్లాలుగా విస్తరించింది కాబట్టి ఆ పాటను ఇప్పుడు పాడుకోవడం సరికాదేమో అన్న వాదన కేవలం ఓ కుంటి సాకు లాగే కనిపిస్తుంది. పోనీ.. జిల్లాల విస్తరణకు ముందు జరిగిన ఆవిర్భావ వేడుకల్లోనైనా ఆ పాటను ఎందుకు దూరం పెట్టారు?.. దానికీ సమాధానం లేదు. అందెశ్రీ దళితుడు అన్న కారణం చేతనే ఆ పాట ఇవాళ అంటరానిదైందని భావించాలేమో!
ఏదేమైనా ప్రత్యేక రాష్ట్రంలో నాలుగేళ్లు పూర్తి చేసుకుంటున్న తెలంగాణకు ఇప్పటికీ రాష్ట్ర గేయం అంటూ లేదు. నిత్యం పాటలతో కదం తొక్కిన తెలంగాణకు.. ఇప్పుడు దాని ఆవిర్భావాన్ని పాడుకునేందుకు మాత్రం అక్షరాలు దొరకట్లేదు. ఉద్యమాన్ని గేయం చేసినోళ్ల కంటే 'బంగారు తెలంగాణ' గేయకర్తలయితేనే దానికి న్యాయం చేస్తారని పాలకులు భావిస్తున్నారేమో!