దుబ్బాకలో చెల్లని హరీశ్.. అహోరాత్రులు శ్రమించినా తప్పని ఓటమి, కారణాలివేనా...?
ఎన్నికైనా.. ఉప ఎన్నికలైనా.. టీఆర్ఎస్ పార్టీలో ట్రబుల్ షూటర్ హరీశ్ రావు. ఎలక్షన్లో రంగంలో దిగాలంటే గెలువాల్సిందే ఇందులో సందేహానికి తావులేదు. హరీశ్ అడుగుపెట్టిన ప్రతీ చోట విజయమే.. కానీ దుబ్బాకలో సీన్ మారిపోయింది. బీజేపీ చేతిలో స్వల్ప మెజార్టీతో ఓడిపోయినా.. ఇప్పటివరకు ఉన్న పేరు పోయింది. అయితే దుబ్బాకలో ఏం జరిగింది..? హరీశ్ మాటను జనం ఎందుకు విశ్వసించలేదు. ఎన్నికల ఫలితాల్లో తేడా ఎందుకు వచ్చింది.
ట్రబుల్ షూటర్ రంగంలోకి దిగినా..
టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి హరీశ్ రావు ఉన్నారు. ముందుండి మరీ పోరాడారు. ఎన్నిక, ఉప ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపుకోసం రంగంలోకి దిగారు. ఏ ఎన్నికల్లోనైనా సరే విజయం సాధించారు. దుబ్బాక బై పోల్ బాధ్యతలను కూడా అందుకోసమే అప్పగించారు. కానీ ఈ సారి ఆశించిన ఫలితాలు మాత్రం రాలేదు. పరాజయం పొందింది. ఇందుకు తొలి కారణం అభ్యర్థి అని చెప్పొచ్చు.
వ్యతిరేకతతోనే..?
అప్పటికే సోలిపేటపై వ్యతిరేకత ఉండగా.. ఆయన భార్యకు టికెట్ కేటాయించారు. సానుభూతి వస్తోందని అనుకుంటే అసలుకే ఎసరొచ్చింది. రామలింగారెడ్డి కుమారుడు టికెట్ కోసం రావడంతో.. సుజాతకు టికెట్ ఇవ్వడం తప్పలేదు. కానీ చెరకు శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 20 వేల ఓట్లు సాధించి.. కాస్త ఓట్లను చీల్చారని చెప్పాలి. మరో అభ్యర్థి ఉంటే ఆ స్థాయిలో ఓట్లు వచ్చేవా అనే ప్రశ్న వస్తోంది.
ముందుగానే రఘు ప్రచారం..
మరో కోణంలో చూస్తే ఉప ఎన్నిక అనగానే రఘునందన్ రావు ప్రచారం ప్రారంభించారు. ఇంటి ఇంటికీ హరీశ్ రావు క్యాంపెయిన్ చేసినా.. ఎక్కడో దెబ్బ కొట్టింది. స్థానిక నేతలను కలుపుకొని పోయినా.. క్షేత్రస్థాయి ప్రజల్లో మాత్రం కాస్త వ్యతిరేకత వచ్చింది. అందుకే వారిని ఓటు బ్యాంకుగా మలచుకోలేదు. ఓటమిపై రివ్యూ చేస్తామని చెప్పినా.. నైతిక బాధ్యత నాదేనని హరీశ్ రావు అంగీకరించారు.
దాడులు చేయడంతో..
దుబ్బాక టీఆర్ఎస్ సిట్టింగ్ సీటు కావడం విశేషం. ఇక్కడ విజయం సాధించాలని అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకు ఉన్న అవకాశాలను అన్నీరకాలుగా ఉపయోగించుకుంది. రఘునందన్ రావు, బంధువులు లక్ష్యంగా దాడులు చేయడం మైనస్ అయ్యింది. దీనిని బీజేపీ ప్రచారం చేసి.. క్యాష్ చేసుకుంది. ప్రజలు కూడా విశ్వసించారు. ఇప్పటికే ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలచుకోవడంలో సక్సెస్ అయ్యారు.
తప్పని ఓటమి
దుబ్బాక నియోజకవర్గం.. హరీశ్ రావు కానిస్టెన్సీ సిద్దిపేటకు సమీపంలో ఉంది. సీఎం కేసీఆర్ సొంత జిల్లాలో గల సీటు.. దీనిని టీఆర్ఎస్ స్టేటస్గా తీసుకొని బరిలోకి దిగింది. ఆ మేరకు ప్రచారం చేసింది. కానీ ఓటర్లు మాత్రం బీజేపీ వైపు మొగ్గుచూపారు. దీంతోపాటు రఘునందన్ రావు ఇప్పటికే రెండుసార్లు ఓడిపోయారు. ఒక్కసారి అవకాశం ఇచ్చి చుద్దామని అనుకున్నారో ఏమో.. బీజేపీ అభ్యర్థికి పట్టం కట్టారు.