ఎందుకు?: కెవిపి బిల్లుకు తెరాస కొలికి, చంద్రబాబు మద్దతు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ప్రతిపాదిస్తూ కాంగ్రెసు సభ్యుడు కెవిపి రామచంద్ర రావు రాజ్యసభలో పెట్టిన ప్రైవేట్ సభ్యుడి బిల్లుపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఎందుకు కొలికి పెడుతుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిజానికి, ఆ బిల్లుకు మద్దతు ఇస్తామని తెరాస అధికారికంగా ప్రకటించిన దాఖలాలు లేవు. తెరాస రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు బిల్లుకు మద్దతిస్తామని చెప్పినట్లు ఎపి పిసిసి అధ్యక్షుడు ఎన్. రఘువీరా రెడ్డి మీడియాకు చెప్పారు. హైకోర్టు విభజన విషయంలోనే కెవిపి ప్రైవేట్ బిల్లుకు మద్దతిస్తామని కెటిఆర్ చెప్పారు.
నిజానికి, ప్రైవేట్ బిల్లు విషయంలో కొంత సానుకూలంగా ప్రతిస్పందించినట్లు కనిపించింది. హైకోర్టు విభజనలో జరుగుతున్న జాప్యం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి ఆ బిల్లుకు మద్దతు ఇవ్వాలనే ఆలోచన కూడా సాగినట్లు సమాచారం. కానీ, తీరా పరిస్థితిని అంచనా వేసుకుని వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది.
కెవిపి ప్రైవేట్ బిల్లుకు మద్దతు తెలపాల్సిన అనివార్య పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ పడింది. మద్దతు ఇవ్వకపోతే రాజకీయంగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ప్రత్యేక హోదాను రాబట్టడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నిజాయితీ ప్రదర్శించడం లేదని, ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి ఆయన భయపడుతున్నారని ప్రతిపక్ష పార్టీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తీవ్రంగా విమర్శలు గుప్పిస్తోంది. ఈ స్థితిలో ప్రైవేట్ బిల్లుకు మద్దతు ఇవ్వకపోతే రాష్ట్రంలో వ్యతిరేకత ఎదురయ్యే ప్రమాదం ఉందని గ్రహించే టిడిపి మద్దతు ప్రకటించినట్లు భావించాలి.
టిడిపి మద్దతు పలికిన నేపథ్యంలో తాము దూరంగా ఉండడం రాజకీయంగా తమకు లాభిస్తుందని తెరాస భావిస్తూ ఉండవచ్చు. బిల్లులో హైకోర్టు విభజన అంశాన్ని కూడా చేర్చాలని, హైకోర్టు విభజనకు బిల్లును ప్రతిపాదించాలని తెరాస అడుగుతోంది. తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు విభజన వివిధ కారణాల వల్ల అత్యవసరంగా మారింది. అందుకే కెవిపి ప్రతిపాదించిన ప్రైవేట్ బిల్లుకు మద్దతిచ్చే విషయంలో తెరాస కొలికి పెడుతున్నట్లు కనిపిస్తోంది.
హైకోర్టు విభజనను చంద్రబాబు అడ్డుకుంటున్నారని గత కేంద్ర న్యాయశాఖ మంత్రి సదాదనంద గౌడ ఒకటి రెండు సార్లు చెప్పారు. కెవిపి బిల్లుకు మద్దతు ఇవ్వడం ద్వారా చంద్రబాబుకు, బిజెపికి దూరం పెరిగే అవకాశం కూడా లేకపోలేదు. నరేంద్ర మోడీకి దగ్గర కావాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్న తెరాసకు ఇది కలిసి రావచ్చు. చంద్రబాబు దూరమైతే తాము దగ్గర కావడానికి అవకాశం ఉంటుందని తెరాస నాయకత్వం భావిస్తుండవచ్చు.