జనసేనాని దెబ్బ, అందుకే టీఆర్ఎస్ యూటర్న్?: జగన్పై కేసీఆర్ దోస్తీ ప్రభావం!
హైదరాబాద్: ఇటీవలి వరకు ఏపీ రాజకీయాల్లో తాము వేలు పెడతామని చెప్పిన తెరాస ఇప్పుడు, యూటర్న్ తీసుకుంది. ఇటీవల పత్రికా ఇంటర్వ్యూలలో మాట్లాడిన తెరాస అధికార ప్రతినిధి కేటీ రామారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెరాసకు ఆంధ్ర రాజకీయాల్లో వేలు పెట్టాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. అయితే ఏపీ సీఎం చంద్రబాబుపై మాత్రం మండిపడ్డారు. ఆయన నెగిటివ్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు.
'పవర్' చూపిస్తాడా?: ఊహించని బాంబుపేల్చిన పవన్ కళ్యాణ్, ఆ దెబ్బ కేసీఆర్కేనా?
హఠాత్తుగా యూటర్న్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. తాము ఏపీ రాజకీయాల్లో వేలు పెడతామన్నారు. ఆ తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒకటి రెండు సార్లు ఏపీకి వెళ్లి.. చంద్రబాబును ధనుమాడారు. వైసీపీ అధినేత వైయస్ జగన్తో కేటీఆర్ థర్డ్ ఫ్రంట్ గురించి చర్చలు జరిపారు. అంతేకాదు, ఏపీ రాజకీయాల్లో పక్కా వేలు పెడతాం అన్నట్లుగా మాట్లాడారు. కానీ ఇప్పుడు లోకసభ ఎన్నికలకు ముందు కేటీఆర్ హఠాత్తుగా యూటర్న్ తీసుకున్నారు. దీనికి కారణం ఏమిటనే చర్చ సాగుతోంది.
అందుకే యూటర్న్ తీసుకున్నారా?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవలి వరకు తెలంగాణ ఎన్నికలపై యాక్టివ్గా కనిపించలేదు. ఆయన తన దృష్టి అంతా ఏపీ రాజకీయాలపై ఉంచారు. కానీ మూడు రోజుల క్రితం డేటా చోరీ అంశంపై పరోక్షంగా కేసీఆర్, చంద్రబాబు, జగన్లకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. మరుసటి రోజు హఠాత్తుగా యూపీలో తేలారు. మాయావతితో చర్చలు జరిపి తెలంగాణలో పోటీ చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు శనివారం మల్కాజిగిరి అభ్యర్థిని ప్రకటించారు. తెలంగాణలో బీఎస్పీకి ఎంతోకొంత ఓటింగ్ ఉంది. ఇప్పుడు జనసేన, బీఎస్పీలు కలిసి పోటీ చేస్తే అధికార పార్టీకే నష్టమని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఊహించని నిర్ణయం, తెరాసకు చెమటలు పట్టించిందా, అందుకే యూటర్న్ తీసుకున్నారా అనే చర్చ సాగుతోంది.
జగన్తో దోస్తీ ప్రభావం ఉంటుందా?
టీడీపీ నేతలు తెలంగాణ సీఎం కేసీఆర్ను ఏపీ వ్యతిరేకిగా చెబుతోన్న విషయం తెలిసిందే. ఉద్యమం సమయంలో ఏపీ ప్రజలను తిట్టారని, ఏపీ బిర్యానీ, బ్రాహ్మణులను కూడా వదిలిపెట్టలేదని, దీంతోనే ఆయన తీరు అర్థమవుతోందని టీడీపీ చెబుతోంది. అలాంటి టీఆర్ఎస్ వైసీపీకి మద్దతిస్తోందని ఆరోపించారు. జగన్, కేసీఆర్ దోస్తీని ప్రజల్లోకి తీసుకు వెళ్లి, వైసీపీకి సాధ్యమైనంత నష్టం చేయాలని టీడీపీ భావించినట్లుగా కనిపించింది. ఈ కారణంగానే కేటీఆర్తో భేటీ అనంతరం.. జగన్ కూడా కేసీఆర్తో భేటీని పక్కన పెట్టారని అంటున్నారు. అదే సమయంలో డేటా చోరీ అంశం తెరపైకి వచ్చింది. కేసీఆర్తో దోస్తీ ఏపీలో జగన్కు నష్టమా, లాభమా అనే విషయం పక్కన పెడితే దాని ఫలితం ఉంటుందని అంటున్నారు. ఇప్పుడు తాము ఏపీ రాజకీయాల్లో వేలు పెట్టమని టీఆర్ఎస్ చెప్పినప్పటికీ వారితో దోస్తీ ప్రభావం వైసీపీపై ఉంటుందని అంటున్నారు.