అందుకే కేసీఆర్ ప్రభుత్వాన్ని దింపేయాలనుకుంటున్నారా: కేటీఆర్ ఆగ్రహం
హైదరాబాద్: కాంగ్రెస్, బీజేపీలపై మంత్రి కేటీఆర్ సోమవారం మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వంపై విపక్షాలు అసత్య ఆరోపణలు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సింహం సింగిల్గానే వస్తుందని, గుంపులుగా వచ్చేది ఎవరో అందరికీ తెలుసునని రజనీకాంత్ సినిమాలోని డైలాగ్ చెప్పారు. 2014లో కేసీఆర్ ఒక్కరే కాంగ్రెస్ పార్టీని చిత్తు చేశారని చెప్పారు.
సంక్షేమ కార్యక్రమాలకు కేరాఫ్ అడ్రస్ తెలంగాణ అన్నారు. తమ పాలనలో అన్నదాతకు ఎంతో మేలు జరుగుతోందన్నారు. చరిత్రలో ఎవరూ చేయని పనులు ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్నారన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ లోకసభ సాక్షిగా కేసీఆర్ పరిణితి కనబరుస్తూ తెలంగాణను అభివృద్ధి చేస్తున్నారని చెప్పారని గుర్తు చేశారు.
ఇందుకేనా కేసీఆర్ను దింపేసేది?
కేసీఆర్ను ముఖ్యమంత్రి పదవి నుంచి దింపేస్తామని, అప్పటిదాకా నిద్రపోమని చెబుతున్నారని, ఏ కారణంతో ఆయనను దింపాలనుకుంటున్నారో చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు. ఇన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నందుకు దింపాలా అన్నారు. కాంగ్రెస్ పాలనలో ఏనాడైనా ప్రజా సంక్షేమం కోసం కార్యక్రమాలు చేపట్టారా అని నిలదీశారు.
కొందరు ఓర్వడం లేదు
రాష్ట్రంలో ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని కేటీఆర్ అన్నారు. బడ్జెట్లో రూ.40 వేల కోట్లకు పైగా నిధులు సంక్షేమానికి ఖర్చు పెడుతున్నామని తెలిపారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో గురుకులాలను ఏర్పాటు చేశామన్నారు. రామరాజ్యంలో కూడా రైతుల భూమి శిస్తు కట్టారని, అప్పర్ మానేరును నింపి సిరిసిల్ల నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. గ్రామాల్లో ఎంతో అభివృద్ధి జరుగుతుంటే కొందరు ఓర్వడం లేదన్నారు.
ప్రధాని అభినందించారు
కేసీఆర్ను ప్రధాని అభినందించారని చెప్పిన కేటీఆర్, తెలంగాణ అభివృద్ధి గురించి ప్రధాని మోడీకి అర్థమయిందని, కానీ ఇక్కడే ఉన్న నేతలకు అర్థం కావడం లేదన్నారు. ప్రాజెక్టులు కట్టి నీళ్లిస్తామంటే కేసులతో అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీ కలిసి పోటీ చేస్తాయని చెబుతున్నారని, ఎంతమంది కలిసినా తమకు నష్టం లేదన్నారు.
వారికి బుద్ధి చెప్పాలి
కేసీఆర్ పాలనలో రాష్ట్ర ప్రజలు సంతోషంగానే ఉన్నారని, రాజకీయ నిరుద్యోగులే కడుపుమంటతో ఉన్నారని కేటీఆర్ విరుచుకుపడ్డారు. నత్తలు సిగ్గుపడే వేగంతో కాంగ్రెస్ హయాంలో ప్రాజెక్టులు నిర్మించారన్నారు. పచ్చ కామెర్లవారికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని, కాంగ్రెస్ నేతలు చేసే కమీషన్ల దందాలు.. మిగతావారు కూడా చేస్తారనే ఉద్దేశంలో ఉన్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న కాంగ్రెస్ నేతలకు ప్రజలే సరైన బుద్ధి చెప్పాలన్నారు.