జగన్ నన్ను ఎందుకు కలిశాడంటే.., డైనమిక్ నేత : చెప్పిన దాసరి
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కొద్ది నెలల క్రితం తన వద్దకు ఎందుకు వచ్చారనే విషయాన్ని దర్శకరత్న దాసరి నారాయణ రావు వెల్లడించారు. ఆయన టీవీ ఛానల్ ఇంటర్వ్యూలలో మాట్లాడారు.
జగన్ తన ఆశీర్వాదం కోసమే తన వద్దకు వచ్చారని చెప్పారు. ఆయన డైనమిక్ అని, అనుకున్నది సాధిస్తారని ప్రశంసించారు. జగన్, అతని కుటుంబంతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబంతో తనకు ఎప్పటి నుంచి సాన్నిహిత్యం ఉందన్నారు.
జగన్ తన వద్దకు వచ్చాకే కాపు ఉద్యమం ప్రారంభమైందని చెప్పడం సరికాదన్నారు. కాపుల రిజర్వేషన్ కోసం జరుగుతున్న ఉద్యమానికి తన మద్దతు ఉందని చెప్పారు. తాను ఉద్యమానికి మద్దతిస్తున్నానని, అందుకే ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను పరామర్శించానని చెప్పారు.
కాపులకు రిజర్వేషన్ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో పెట్టారని, అందుకే, ఈ అంశం తెరపైకి వచ్చిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని దాసరి చెప్పారు. పార్లమెంటు సాక్షిగా ప్రధాని చేసిన ప్రకటనకు విలువ ఉండదని తాను అనుకోవడం లేదన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కూడా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పారని గుర్తు చేశారు.