జైల్లో ఉన్న భర్తకు మద్యం ఇస్తూ పట్టుబడ్డ మహిళ
హైదరాబాద్: చర్లపల్లి కేంద్ర కారాగారంలో జీవిత ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న భర్తను ములాఖత్లో కలుసుకుని మద్యం బాటిల్, సెల్ఫోన్, పొగాకు ప్యాకెట్ అందజేస్తున్న మహిళను జైలు అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని కుషాయిగూడ పోలీసులకు అప్పగించారు.
కీసర మండలం దమ్మాయిగూడకు చెందిన ఎం. మహేష్(33)కు ఓ హత్యకేసులో శిక్ష పడింది. 2012 నుంచి చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ములాఖత్లో అతడిని కలవడానికి భార్య లక్ష్మీ జైలుకు సోమవారం మధ్యాహ్నం వచ్చింది.
అనుమానం వచ్చిన జైలు అధికారులు ఇతర ఖైదీల మహిళా బంధువులతో తనిఖీ చేయగా ఆమె వద్ద మద్యం బాటిల్, సెల్ఫోన్, పొగాకు ప్యాకెట్ లభించింది. ఆమెను అదుపులోకి తీసుకుని కుషాయిగూడ పోలీసులకు సమాచారమిచ్చారు. ఆమెను విచారిస్తున్నారు.
రూ. 52లక్షల విలువైన నిషిద్ధ గుట్కా లోడ్ పట్టివేత
నిషిద్ధ గుట్కా ప్యాకెట్లతో రోడ్డు పక్కన నిలిపి ఉన్న లారీని పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటన ఆదివారం అర్ధరాత్రి దాటాక నల్లగొండ జిల్లా చిట్యాల మండలం శివారులో జరిగింది. గుట్కా ప్యాకెట్ల లోడును చౌటుప్పల్ రూరల్ సీఐ ప్యాకెట్లను విలేకరుల ఎదుట ప్రదర్శించారు.
అనంతరం చిట్యాల పోలీస్ స్టేషన్లో సిఐ శివరాంరెడ్డి విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. హైదరాబాద్ నుంచి ఒరిస్సా రాష్ట్రానికి తరలిస్తున్న రూ.52 లక్షల 8 వేల విలువ గల గుట్కా ప్యాకెట్లకు సంబంధించిన 80 బస్తాలను పట్టుకున్నామన్నారు.