ఇంట్లో భార్య ముందే మరో అమ్మాయితో వీడియో కాల్స్... భరించలేక ఆమె ఆత్మహత్య...
రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో ఓ గృహిణి ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు ముందు ఓ సెల్ఫీ వీడియోను చిత్రీకరించి ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. తన భర్త వేరే అమ్మాయి మోజులో పడి తనను పట్టించుకోకపోవడం,వేధింపులకు గురిచేస్తుండటం వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు వీడియోలో వెల్లడించింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు మోసపోయానని ఆవేదన వ్యక్తం చేసింది. మృతురాలి తల్లిదండ్రులు కూడా తమ బిడ్డ చావుకు అల్లుడే కారణమని ఆరోపిస్తున్నారు.
ఇంట్లోనే ఆమెతో వీడియో కాల్స్..
'కేసులు,హోటల్స్ అంటూ బయటకెళ్లి వాడు ఆమెతో తిరుగుతున్నాడు. ఇంట్లోనే ఆమెతో వీడియో కాల్స్ మాట్లాడుతున్నాడు. ఇవన్నీ చూసి చాలా బాధపడ్డాను. కానీ మారుతాడన్న ప్రేమతో భరిస్తూ వచ్చాను. ప్రతీరోజూ వంట చేసి,బట్టలుతికి, అన్ని విధాలుగా వాడికి అనుకూలంగా ఉన్నాను. కానీ వాడు మాత్రం మారలేదు. ఇంకా ఇలాంటి వాడితో ప్రేమ ప్రేమ అంటూ బతికితే ఏమొస్తుంది. అందుకే నేను చనిపోతున్నా. వాడిని ఎవరూ ఏమీ చేయనక్కర్లేదు. వాడు చేసిన కర్మలు,వాడిపై ఉన్న కేసులే వాడిని తీసుకుపోతాయి. అమ్మానాన్న.. తల్లిదండ్రులుగా మీరు నాకు ఎక్కువే ఇచ్చారు. కానీ నేనే మిమ్మల్ని మోసం చేసి వెళ్లిపోతున్నాను.' అని మృతురాలు లావణ్య(32) సెల్ఫీ వీడియోలో పేర్కొంది.
మృతురాలి తండ్రి ఏమంటున్నారు...
'సార్.. వాడు మా ఇంటికొచ్చి అమ్మాయిని ప్రేమిస్తున్నాను,పెళ్లి చేసుకుంటున్నానని చెప్పాడు. 2012, జులైలో పెళ్లి జరిగింది. కొన్నాళ్లు అన్యోన్యంగానే ఉన్నారు. మొదట్లో వాడికి జాబ్ కూడా లేదు, ఎలాంటి ఆర్థిక అండ లేదు. నా కూతురు ఉద్యోగం చేసి వాడిని సాకింది. వెళ్లినప్పుడల్లా నేనో పాతికవేలు ఇచ్చేవాడిని. సెప్టెంబర్లో నా కూతురికి ఆరో నెల ఉన్నప్పుడు.. పొట్టపై కాలితో తన్ని దాడి చేశాడు. జుట్టపట్టుకుని ఈడ్చి ప్రెగ్నెన్సీ పోయేటట్టు చేశాడు. ఇప్పుడేమో చెన్నైకి చెందిన మరో అమ్మాయితో తిరుగుతున్నాడు.' అని మృతురాలి తండ్రి వాపోయారు.
లావణ్య తల్లి ఆరోపణలు..
తమ కుమార్తె ఫేస్ బుక్లో పోస్ట్ చేసిన సెల్ఫీ వీడియో చూసి తెలిసినవాళ్లు తమకు ఫోన్ చేశారని లావణ్య తల్లి అన్నారు. ఆస్పత్రిలో చేర్పించారని... సీరియస్గా ఉందని చెప్పారన్నారు. కానీ ఆ తర్వాత కాసేపటికే మృతి చెందిందన్న విషయం తెలిసిందని వాపోయారు. తమ అల్లుడి కారణంగానే కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు.
Recommended Video
8 ఏళ్ల క్రితం పెళ్లి...
శంషాబాద్ రాళ్లగూడకు చెందిన లావణ్య(32)కు వెంకటేశం అనే యువకుడితో 8 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరిది ప్రేమ వివాహం. పెళ్లయిన కొద్దిరోజులు ఖాళీగానే ఉన్న వెంకటేశంకు ఆ తర్వాత జెట్ ఎయిర్ వేస్ పైలట్గా ఉద్యోగం వచ్చింది. అప్పటినుంచి అతని ప్రవర్తనలో మార్పు వచ్చినట్టు తెలుస్తోంది. వేరే అమ్మాయి ఒకరితో సంబంధం పెట్టుకుని లావణ్యను పట్టించుకోవట్లేదన్న ఆరోపణలున్నాయి. ఇదే విషయమై ఇద్దరికీ గొడవలు కూడా జరిగినట్టు తెలుస్తోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడు ఇలా మోసం చేయడంతో లావణ్య మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడింది.