బావా! నీతోనే ఉంటా: అక్క భర్తతో వివాహేతర సంబంధం, బావని వదల్లేక భర్త హత్యకు ప్లాన్
Recommended Video
వరంగల్: బావతో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని, ఓ మహిళ పెళ్లైన ఆరు నెలలకే భర్తను కడతేర్చాలని చూసింది. తన అక్క భర్తతో కలిసి భర్తను హత్య చేసేందుకు కుట్ర చేసింది. ఇటీవల భర్తలను చంపుతున్న లేదా భర్తలపై హత్యాయత్నం చేస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఈ సంఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం అశ్వరావుపల్లిలో జరిగింది.
యాదాద్రి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామానికి చెందిన పోషయ్య పెద్ద కూతురు గాయత్రికి విజయవాడకు చెందిన శ్రీనుతో ఏడేళ్ల క్రితం పెళ్లయింది. శ్రీనుది మెదక్ జిల్లానే. కానీ బతుకుదెరువు కోసం విజయవాడ వెళ్లారు. పోషయ్య చిన్న కూతురు జ్యోతి అప్పుడప్పుడు విజయవాడలోని అక్క ఇంటికి వెళ్లి వచ్చేది. ఈ క్రమంలో తన బావ శ్రీనుతో వివాహేతర సంబంధం ఏర్పడింది. మరోవైపు, జ్యోతికి ఆరు నెలల క్రితం అశ్వరావుపల్లికి చెందిన రాజుతో పెళ్లయింది.
నాకు ఇష్టం లేదు నీతోనే ఉంటా
రాజుతో జ్యోతికి పెళ్లయినప్పటికీ, తనకు భర్తతో ఉండటం ఇష్టం లేదని, నీతోనే ఉంటానని బావతో ఆమె చెప్పింది. ఇష్టం లేని పెళ్లి చేసుకున్న జ్యోతి మనసు బావ పైనే ఉంది. దీంతో రాజును చంపి తనను తీసుకు వెళ్లమని బావ శ్రీనుతో చెప్పింది. పలుమార్లు తన గోడును బావతో చెప్పుకుంది. దీంతో మరదలు జ్యోతి కోరిక మేరకు శ్రీను.. రాజును చంపాలని నిర్ణయించుకున్నాడు.
మూడు నెలల్లో 1500సార్లు ఫోన్లో మాట్లాడుకున్నారు
బావ శ్రీను, మరదలు జ్యోతిలు ఎన్నోసార్లు ఫోన్లో మాట్లాడుకున్నారు. ఆమె మూడు నెలలుగా శ్రీనుతో 1500 సార్లు ఫోన్లో మాట్లాడింది. గత నెల 20న శ్రీను విజయవాడ నుంచి అశ్వరావుపల్లికి వచ్చాడు. ఊరి చివర పొదల్లో మరుగుదొడ్డి శుభ్రం చేసే యాసిడ్ బాటిల్ దాచిపెట్టాడు. అదే నెల 27న విజయవాడలో తనకు తెలిసిన వెంకట దుర్గారావు, మరో బాలుడికి రూ.20వేలు ఇస్తామని సుఫారీ మాట్లాడుకొని వారితో కలిసి అశ్వరావుపల్లికి వచ్చాడు.
యాసిడ్ పోసి, చంపేందుకు ప్రయత్నం
అప్పుడు రాజు ఆచూకీ దొరకలేదు. దీంతో విజయవాడకు వెళ్లి తిరిగి ఈ నెల 2వ తేదీ రాత్రి అశ్వరావుపల్లికి వచ్చాడు. మరుసటి రోజు గ్రామ శివారులో రాజు గొర్రెలు మేపుతుండగా శ్రీను, వెంకట దుర్గారావు, బాలుడు కలిసి అప్పటికే అక్కడ దాచిపెట్టిన యాసిడ్ పోశారు. ఆ తర్వాత అతని గొంతు పిసికి చంపేందుకు ప్రయత్నించారు. రాజు గట్టిగా అరవడంతో చుట్టుపక్కల ఉన్న వారు వచ్చారు. నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. అనంతరం రాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పట్టేశారు
పోలీసులు అశ్వరావుపల్లిలో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించి, విచారించారు. నిందితులు వారి తప్పును అంగీకరించారు. హత్యాయత్నానికి పాల్పడిన శ్రీను, వెంకట దుర్గారావు, మరో బాలుడు, హత్యకు కుట్ర పన్నిన జ్యోతిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
చివర్లో ఫోన్ చేసుకోకుండా ప్లాన్
జ్యోతి ఫోన్ కాల్ డేటా, గ్రామంలోని సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించారు. రఘునాథపల్లి పోలీస్ స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా తచ్చాడుతూ వారు దొరికారు. మరో ఆసక్తికర విషయం ఏమంటే ఎలాంటి క్లూలు ఇవ్వవద్దని శ్రీను, జ్యోతిలు పదిహేను రోజులకు ముందు నుంచి ఫోన్ కాల్స్ ఆపేశారు. ముందు సీసీ కెమెరాలు ఆధారంగా పట్టుకున్నారు. ఆ తర్వాత అంతకుముందు ఫోన్ కాల్ డాటా కూడా వెలుగు చూసింది.