మెట్రో ఆలోచన చంద్రబాబుదే: కెసిఆర్ అహ్వానిస్తారా?
హైదరాబాద్ మెట్రో రైలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అహ్వానించారా, లేదా అనేది సందేహంగానే ఉంది.
హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అహ్వానించారా, లేదా అనేది సందేహంగానే ఉంది. ఈ విషయంపై అధికార వర్గాల నుంచి ఏ విధమైన సమాచారం కూడా రాలేదు.
ఈ నెల 28వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా హైదరాబాద్ మెట్రో రైలు ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. అయితే, చంద్రబాబుకు ఆహ్వానం ఉందా, లేదా అనేది ఇప్పటి వరకు స్పష్టం కాలేదు. మెట్రో రైలు ప్రతిపాదనలను 2002లో చంద్రబాబు నాయుడే పంపించారు.
హైదరాబాదులో సాఫ్ట్వేర్ పరిశ్రమ పెరుగుతున్న నేపథ్యంలో టెక్కీలు వేగంగా తమ కార్యాలయాలకు నగరంలోని ఏ వైపు నుంచైనా చేరుకోవడానికి వీలవుతుందనే ఉద్దేశంతో చంద్రబాబు ఆ పథకానికి శ్రీకారం చుట్టారు. వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రాజెక్టు పనుల్లో కాస్తా వేగం పెరిగింది.
రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కెసిఆర్ ప్రభుత్వం దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే, ఇంకా చాలా పనులు మిగిలే ఉన్నాయనే మాట వినిపిస్తోంది. అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూతురు ఇవాంకా సమ్మిట్కు కూడా చంద్రబాబుకు ఆహ్వానం అందలేదనే ప్రచారం సాగుతోంది.