ఎంపీగా పోటీ చెస్తానంటున్న డీకె అరుణ..! ఈ నెలాఖరుకు ఎంపీ అభ్యర్థుల ప్రకటన.! -విజయశాంతి.!
హైదరాబాద్ : మొన్నటి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ దొడ్డిదారిన అధికారంలోకి వచ్చిందని కాంగ్రెస్ పార్టీ క్యాంపెయినింగ్ కమిటీ కో ఛైర్మెన్ డీకే అరుణ వ్యాఖ్యానించారు. టీ కాంగ్రెస్ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ విజయశాంతితో కలసి అరుణ మీడియాతో మాట్లాడారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో క్యాంపెయినింగ్ కమిటీ కాంగ్రెస్ పార్టీని విజయం దిశగా నిడిపిస్తుందని చెప్పారు. మరో సారి అధికార దుర్వినియోగానికి పాల్పడైనా 16 ఎంపీ సీట్లు గెలవాలనుకుంటున్న టీఆర్ఎస్ కుట్రలను ప్రజలు తిప్పికొడతారని డీకేఅరుణ అన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి కృతజ్ఞతగా అత్యధిక పార్లమెంట్ స్ధానాల్లో కాంగ్రెస ను గెలిపించాలని ఆమె తెలంగాణ ప్రజలకు పిలపునిచ్చారు. అభివృద్ధి చెందిన దేశాలే బ్యాలెట్ పేపర్లు వాడుతున్నాయని, అన్ని పార్టీల డిమాండ్ ను ఎన్నికల కమీషన్ పరిగణలోకి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. అధిష్టానం ఆదేశిస్తే ఎంపీగా పోటీ చేస్తానని డీకేఅరుణ చెప్పారు.
ఫిబ్రవరి నెలాఖరికి లోక్ సభ స్ధానాలకు పోటీ చేసే అభ్యర్థులను ప్రకటిస్తామని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ అధ్యక్షురాలు విజయశాంతి వెల్లడించారు. టీడీపీతో పోటీ వద్దనే అనుకుంటున్నట్లు విజయశాంతి వ్యాఖ్యానించారు. ఒంటరిగానే పోటీ చేయాలనే ఆలోచన అందరిలో ఉందని, అధిష్టానం ఏం చెప్తుందో చూడాలన్నారు. పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే తమ ఆలోచన అని అన్నారు.
అధిష్టానం పోటీ చేయాలని ఆదేశిస్తే ఖచ్చితంగా పోటీ చేస్తానని విజయశాంతి ప్రకటించారు. కమిటీలో చర్చించి సమ్మక్క, సారలమ్మ నుంచి ప్రచారం మొదలు పెడతామని విజయశాంతి తెలిపారు. కేసీఆర్ యాగాలకే పరిమితమయ్యారన్న రాములమ్మ, మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గెలుపు పరిపూర్ణం కాదని చెప్పారు. పార్లమెంటు ఎన్నికల్లో ఆ సంగతి అందరికీ అర్ధమవుతుందని విజయశాంతి స్పష్టం చేసారు.