కెసిఆర్పై అసంతృప్తి: సోనియాతో భేటీ, కాంగ్రెసులోకి తిరిగి డిఎస్?
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తనకు తగిన గుర్తింపు ఇవ్వడం లేదని, కేవలం ఉత్సవ విగ్రహంగా ఉండాల్సి వస్తుందనే ఆవేదనతో ఆయన కాంగ్రెసులోకి తిరిగి వచ్చేందుకు డిఎస్ సంసిద్ధత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
హైదరాబాద్: సీనియర్ రాజకీయ నేత డి. శ్రీనివాస్ తిరిగి సొంత గూటికి చేరుకుంటారనే ప్రచారం సాగుతోంది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తనకు తగిన గుర్తింపు ఇవ్వడం లేదని, కేవలం ఉత్సవ విగ్రహంగా ఉండాల్సి వస్తుందనే ఆవేదనతో ఆయన కాంగ్రెసులోకి తిరిగి వచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
బంగారు తెలంగాణ నిర్మాణం కోసమంటూ ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరారు. ఆయనను కెసిఆర్ బాగానే గౌరవించారు. ఆయనకు ప్రత్యేక సలహాదారు పదవి ఇచ్చి, క్యాబినెట్ హోదా ఇచ్చారు. ఆ తర్వాత రాజ్యసభకు కూడా పంపించారు.
కానీ, ఆ తర్వాతే పరిస్థితి మారిందని అంటున్నారు. నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు, కెసిఆర్ తనయ కల్వకుంట్ల కవిత చొరవతో ఆయన తగిన హామీలు తీసుకుని తెరాసలో చేరినట్లు చెబుతున్నారు. అయితే, ఇప్పుడు కెసిఆర్ ఆ హమీలను నిలుపుకునే స్థితిలో లేరని అంటున్నారు.
సోనియాతో బేటీ....
డిఎస్గా పిలుచుకునే డి. శ్రీనివాస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయనకు కాంగ్రెసు అధిష్టానంతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ చొరవతో అహ్మద్ పటేల్ డిఎస్తో మాట్లాడినట్లు ప్రచారం సాగుతోంది. అహ్మద్ పటేల్తో కలిసి ఆయన సోనియా గాంధీతో సమావేశమైనట్లు కూడా చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని పరిస్థితులను సోనియా డిఎస్ను అడిగి తెలుసుకున్నట్లు చెబుతున్నారు.
నేరుగా చెప్పవచ్చునని....
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏ సమస్య ఉన్నా తనతో నేరుగా మాట్లాడవచ్చునని సోనియా డిఎస్కు చెప్పారని అంటున్నారు. అదే సమయంలో తెలంగాణ కాంగ్రెసు వ్యవహారాల ఇంచారర్జీగా దిగ్విజయ్ సింగ్ను తప్పించాలని డిఎఎస్ ఆమెకు చెప్పినట్లు తెలుస్తోంది. అధిష్టానానికి గతంలో ఆయన తప్పుడు నివేదికలు ఇచ్చారని, దాని వల్ల సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశం లేకుండా పోయిందని డిఎస్ ఆమెకు వివరించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత డిగ్గీపై వేటు పడినట్లు చెబుతున్నారు.
హామీ ఇవ్వని కెసిఆర్....
వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు సంజయ్కి నిజామాబాద్ అర్బన్ సీటు నుంచి గానీ రూరల్ సీటు నుంచి గానీ పోటీ చేసే అవకాశం కల్పించాలని డిఎస్ కెసిఆర్ను తాను తెరాసలో చేరిన సమయంలో కోరినట్లు చెబుతున్నారు. అందుకు అప్పుడు అంగీకరించిన కెసిఆర్ ఇప్పుడు చూద్దాంలే అనే ధోరణిలో వ్యవహరిస్తున్నారని అంటున్నారు. సంజయ్ గతంలో నిజామాబాద్ కార్పోరేషన్ చైర్మన్గా పనిచేశారు.
ప్రాధాన్యం
విధాన నిర్ణయాల్లో కెసిఆర్ తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని డిఎస్ ఆవేదన చెందుతున్నట్లు చెబుతున్నారు. కెసిఆర్ అపాయింట్మెంట్ కోసం ఆయన ఎదురు చూస్తున్నప్పటికీ ఫలితం ఉండడం లేదని అంటున్నారు. తాను క్రీయాశీలక రాజకీయాలకు దూరమైనప్పటికీ తన కుమారుడు క్రియాశీలక రాజకీయాల్లో ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. కెసిఆర్ అందుకు సిద్దంగా లేకపోవడంతో తిరిగి కాంగ్రెసులో చేరాలనే నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.