మొండి వైఖరిని ఎండ గడతాం..! కేసీఆర్ పై నిప్పులు చెరిగిన మందకృష్ణ..!!
Recommended Video
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం పై, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు విధానాలపై పై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ నిప్పులు చెరిగారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని పంజగుట్టలో కూల్చిన చోటనే తిరిగి ప్రతిష్ఠించాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే చంద్రశేఖర్ రావు ప్రభుత్వాన్ని గద్దె దించి చెత్తకుప్పలో పారేసే వరకు పోరాడతామని హెచ్చరించారు. అనుమతి లేదన్న సాకుతో ఒక్క రోజులోనే అంబేడ్కర్ విగ్రహాన్ని తొలగించి ముక్కలు చేసి చెత్తకుప్పలో వేశారని, మరి ఆ పక్కనే ఏళ్ల తరబడి ఉన్న వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహానికి అనుమతి ఉందా? అని ప్రశ్నించారు. చంద్రశేఖర్ రావు సీఎంగా పగ్గాలు చేపట్టిన నాటి నుంచి దళిత వ్యతిరేక విధానాలు, కుల వివక్షను పాటిస్తున్నారని మందకృష్ణ ఘాటుగా విమర్శించారు.
అంబేడ్కర్ విగ్రహాన్ని కూల్చిన చోటే ప్రతిష్ఠించాలి..! కేసీఆర్ దళిత వ్యతిరేకన్న మందకృష్ణ..!!
అంబేడ్కర్ విగ్రహాన్ని తొలగించినందుకు నిరసనగా ఎమ్మార్పీఎస్ బుధవారం ఇందిరాపార్కు వద్ద దర్నాచౌక్లో అంబేడ్కర్వాదుల గర్జన మహాసభ ను నిర్వహించింది. జె.బి.రాజు అధ్యక్షతన జరిగిన ఈ సభకు అఖిలపక్షం నేతలు, విద్యార్థి, మహిళా, ప్రజాసంఘాల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాట్లాడుతూ.. సీఎం చంద్రశేఖర్ రావు మొదటిసారి అధికారంలోకి వచ్చినపుడు దళితుణ్ని సీఎం చేస్తానని మోసం చేశారని, రెండోసారి ఏకంగా దళితుల ఆరాధ్య దైవమైన అంబేడ్కర్నే అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులను మోసం చేయడంలో కేసీఆర్ నెం.1 మోసగాడు అని ఆరోపించారు.
ప్రణబ్ కాళ్లు పట్టుకున్నారు.. కోవింద్కేమో బొకేనా..? కేసీఆర్ సర్కార్ను నీడలా వెంటాడతామన్న మందకృష్ణ..!!
చంద్రశేఖర్ రావు సీఎం అయిన నాటి నుంచి అంబేద్కర్, బాబు జగ్జీవన్రాం, మహాత్మా జ్యోతిబా పూలే జయంతికి హాజరుకాకుండా దళిత, బడుగు బలహీనవర్గాలను అవమానిస్తున్నారని, భవిష్యత్తులో నీ ప్రభుత్వ భరతం పడతామని హెచ్చరించారు. సీఎం చంద్రశేఖర్ రావు పచ్చి కులవాది అని, ప్రతి సందర్భంలో కుల వివక్షను పాటిస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ అధ్యక్షుడి హోదాలో 2001 నుంచి 2014 వరకు చంద్రశేఖర్ రావు ఏనాడూ అంబేడ్కర్ జయంతి రోజున ఆయన విగ్రహానికి దండ వేయలేదని అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా ప్రగతి భవన్కు 18 కిలోమీటర్లు ఉన్న బాపూఘాట్కు వెళ్లి నివాళులు అర్పిస్తారని, అదే అంబేడ్కర్ జయంతి రోజు 2 కిలోమీటర్ల దూరం కూడా లేని ట్యాంక్బండ్కు వచ్చి నివాళులర్పించరని చంద్రశేఖర్ రావును తప్పుబట్టారు.
గవర్నర్కు, రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం..! ధర్నాచౌక్ వద్ద అంబేడ్కర్వాదుల మహాగర్జన సభ..!!
పంజాగుట్టలో కూల్చిన చోటనే అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్తో చేపట్టనున్న 20 రోజుల కార్యాచరణను మంద కృష్ణ ప్రకటించారు. తొలుత గవర్నర్ నరసింహన్ను కలిసి వినతిపత్రం సమర్పిస్తామని, ఆ తర్వాత జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ను కలిసి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. అనంతరం రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ను కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. అప్పటికీ సీఎం దిగిరాకపోతే భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. అంబేడ్కర్ విగ్రహం కూల్చివేత యాథృచ్ఛికంగా జరగలేదని టీజేఎస్ అధినేత కోదండరాం అన్నారు. రాష్ట్రంలో నిరంకుశ, ఫ్యూడల్ పాలన సాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ-టీఎస్ అధ్యక్షుడు రమణ, రావుల చంద్రశేఖర్రెడ్డి, చాడ వెంకటరెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, వీహెచ్, కుసుమ్కుమార్, రాంచందర్రావు పాల్గొన్నారు.
భారీగా పోలీసులు..! అంబేడ్కర్ మాస్కులు, నల్ల జెండాలతో నిరసన..!!
మహాగర్జన సభ నేపథ్యంలో పంజాగుట్ట ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు. సభకు వచ్చిన వారంతా అంబేడ్కర్ విగ్రహాన్ని తొలగించిన ప్రాంతంలో నివాళులర్పించడానికి వస్తారనే సమాచారం రావడంతో ఉదయం నుంచే ఐల్యాండ్ చుట్టూ ఇనుప బారికేడ్లను ఏర్పాటు చేశారు. సచివాలయం, తెలుగుతల్లి ఫ్లై ఓవర్, ఖైరతాబాద్ చౌరస్తా, మోనప్ప ఐల్యాండ్, ప్రగతి భవన్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. పలు దళిత సంఘాలు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి వెళతామని చెప్పినా పోలీసులు అనుమతించలేదు. మెదక్ జిల్లాకు చెందినవారు ఖైరతాబాద్ ఫ్లైఓవర్ మీదుగా రాగా.. అడ్డుకుని నెక్లెస్ రోడ్డు మీదుగా పంపించారు. సభకు వచ్చినవారంతా అంబ్కేడర్ మాస్కులు ధరించి, నల్లజెండాలతో నిరసన తెలపడం విశేషం.