తెలంగాణలో ఐఏఎస్ ల బదిలీలు ..? జాబితా రూపొందించిన సీఎస్ .. ఓకే చెప్పిన కేసీఆర్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ చేయనున్నారు. దీనిపై ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చిన సీఎం కేసీఆర్ జాబితా కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. అధికారుల పనితీరు, కీలకశాఖలు .. అమలవుతున్న సంక్షేమ పథకాలను బేరిజు వేసుకొని బాధ్యతలు అప్పగించనున్నారు.
బడ్జెట్ వల్లే ఆలస్యం ..?
వాస్తవానికి ఐఏఎస్ అధికారుల బదిలీ ప్రక్రియ ఇప్పటికే చేపట్టాల్సి ఉంది. అయితే బడ్జెట్ కేటాయింపుల వల్ల ఆ ప్రక్రియ ఆలస్యమైంది. రేపు సభలో సీఎం కేసీఆర్ బడ్జెట్ ప్రవేశపెట్టనుండంతో .. ఆ తర్వాత బదిలీకి సంబంధించి ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యరద్శి ఎస్కే జోషి .. జాబితాను రూపొందించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ..
రాష్ట్రంలో కీలక పరిణామం .. బడ్జెట్ ఆ తర్వాత మిగలింది లోక్ సభ ఎన్నికలు. ఈ క్రమంలోనే ఐఏఎస్ అధికారుల బదిలీ చేపడుతోంది ప్రభుత్వం. వచ్చే ఎన్నికల్లో కీ రోల్ పోషించాలని భావిస్తోన్న కేసీఆర్ అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఫెడరల్ ఫ్రంట్ పేరుతో వివిధ రాజకీయ పార్టీ అధినేతలతో చర్చలు కూడా జరిపారు. దీంతో ఆయన లోక్ సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారని స్పష్టమవుతోంది. అందుకోసమే బ్యూరోక్రాట్ల బదిలీ చేపడుతున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
వెయిటింగ్ లో కొందరు అధికారులు ..
ఇప్పటికే కొందరు ఐఏఎస్ అధికారులు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు. వారి పని సామర్థ్యం ఆధారంగా వారిని పరిగణనలోకి తీసుకొని పోస్టింగ్ ఇవ్వనున్నారు. సీఎస్ రూపొందించిన జాబితాలో వీరికి కూడా కీలక శాఖలు ఉన్నట్టు తెలుస్తోంది.