పవన్ కళ్యాణ్ దూకుడు, అంతా సస్పెన్స్: 'హైదరాబాద్' కోసమా?
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. గత సార్వత్రిక ఎన్నికల్లో తాను హామీ ఇచ్చినట్లుగానే తాను మద్దతు పలికిన పార్టీలను, విపక్షాలను నిలదీస్తున్నారు. తెలుగుదేశం పార్టీతో మొదలై... కాంగ్రెస్ పార్టీ వరకు ఆయన సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా నిలదీస్తున్నారు.
ఏపీ రాజధాని భూసమీకరణ పైన టిడిపిని కొద్ది నెలల క్రితం నిలదీయడం ప్రారంభించిన పవన్.. తాజాగా సోమవారం నాడు ప్రత్యేక హోదా పైన కాంగ్రెస్ పార్టీని నిలదీశారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ 'ప్రశ్నించడం'పై పలు కోణాల్లో చర్చ జరుగుతోంది.
ఎప్పటికప్పుడు పవన్ నిలదీయడంపై తమకు నిరాశ కలిగించేలా ఉన్న పార్టీలు మండిపడటం సహజంగానే జరుగుతోంది. పవన్ కళ్యాణ్ ఇటీవల కొద్ది రోజులుగా వరుసగా ట్వీట్లతో రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తున్నారు. దీనిపై చర్చ సాగుతోంది.
పవన్ వ్యాఖ్యలు... చంద్రబాబుకు మద్దతు పలికే విధంగా ఉన్నాయని టిఆర్ఎస్, వైసీపీలు అంటే, సెక్షన్ 8 పైన, ప్రత్యేక హోదా పైన వ్యాఖ్యలకు టిడిపి నేతలు భగ్గుమన్నారు.
ఓటుకు నోటు గురించి పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదని పలు పార్టీలు నిలదీశాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేక హోదాతో కౌంటర్ ఇచ్చారు.
ఓటుకు నోటు కేసు కోర్టులో ఉన్నందున తాను స్పందించనని చెప్పారు. అదే సమయంలో సెక్షన్ 8 వద్దని చంద్రబాబుకు సూచించారు. ఆంధ్రొళ్లు అనొద్దని టీఆర్ఎస్ పార్టీ నేతలకు హితవు పలికారు. అయితే, పవన్ వ్యాఖ్యల వెనుక గ్రేటర్ ప్లాన్ కూడా లేకపోలేదనే వాదనలు వినిపిస్తున్నాయి.
త్వరలో గ్రేటర్ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన వరుసగా స్పందిస్తుండవచ్చుననే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. హైదరాబాదులో పెద్ద ఎత్తున సీమాంధ్రులు ఉన్నారు. సెక్షన్ 8ను పెద్దగా ఎవరూ పట్టించుకోవడే లేదు. ఈ నేపథ్యంలో సెక్షన్ 8 వద్దని చెప్పారనే చెప్పవచ్చు. అదే సమయంలో ప్రత్యేక హోదా కోసం నిన్న టిడిపి నేతలను, ఈరోజు కాంగ్రెస్ పార్టీని నిలదీశారు.
పవన్ కళ్యాణ్ వరుస ట్వీట్లు.. రానున్న గ్రేటర్ ఎన్నికల్లో యాక్టివ్ పాలిటిక్స్కు సంకేతాలా అనే చర్చ సాగుతోంది. అదే నిజమైతే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఆయన టిడిపి - బిజెపిలకు మరోసారి మద్దతుతోనే సరిపుచ్చుతారా? లేక జనసేన పోటీ చేస్తుందా? అనే చర్చ సాగుతోంది.