జూ.ఎన్టీఆర్కు తెలంగాణ టీడీపీ పగ్గాలు, ఎప్పుడంటే: స్పష్టం చేసిన పార్టీ నేత
హైదరాబాద్/ఖమ్మం: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నవ్యాంధ్రకు పరిమితమవుతూ, తెలంగాణ బాధ్యతలను టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్కు అప్పగిస్తారనే అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అయితే ఈసారి కేవలం అప్పగించాలనే మాటలు మాత్రమే కాకుండా.. తెలంగాణ బాధ్యతలు జూనియర్ చేపడతాని ఓ తెలంగాణ టీడీపీ నేత వ్యాఖ్యానించారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ఇద్దరు టీడీపీ నుంచి గెలిచారు. అది కూడా ఖమ్మం నుంచే. ఒకరు సండ్ర వెంకటవీరయ్య కాగా, రెండో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర రావు. సండ్ర తెరాసలో చేరుతున్నారు. మెచ్చా కూడా ఆయన దారిలోనే నడుస్తారనే ప్రచారం సాగింది. ఈ వ్యాఖ్యలను ఆయన కొట్టి పారేశారు. ఇందులో భాగంగా జూ.ఎన్టీఆర్ గురించి మాట్లాడారు.
పార్టీ మారడంపై మెచ్చా నాగేశ్వర రావు
తాను ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తే లేదని మెచ్చా చెప్పారు. రెండేళ్లలో తెలుగుదేశం పార్టీకి తిరిగి పూర్వ వైభవం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నేతలు తనను సంప్రదించిన మాట వాస్తమేననని, పార్టీ మారలేనని వారికి స్పష్టం చేశానని అన్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య టీడీపీని వీడినంత మాత్రాన కిందిస్థాయి కార్యకర్తలెవరూ పార్టీ మారే పరిస్థితి లేదని చెప్పారు. కార్యకర్తలకు నేతలం అండగా ఉంటామన్నారు. సండ్ర పార్టీ మారడం వ్యక్తిగత విషయమని చెప్పారు.
జూ.ఎన్టీఆర్ నాయకత్వం
రాబోయే రెండేళ్లలో తెలుగుదేశం పార్టీకి కొత్త నాయకత్వం వస్తుందని మెచ్చా చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పగ్గాలు చేపడతారని కూడా చెప్పారు. కాగా, 2012లోనే జూ.ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది. ఆ తర్వాత వివాదం చెలరేగింది. 2014లో రాష్ట్ర విభజన నేపథ్యంలో లోకేష్ ఏపీకి ఉంటారని, తెలంగాణ బాధ్యతలు జూ.ఎన్టీఆర్కు అప్పగించాలనే వాదన తెరపైకి వచ్చింది.
చంద్రబాబు, సుహాసిని
ఓ సందర్భంగాలో తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తుండగా.. జూ.ఎన్టీఆర్ను తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా చేయాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు అలాంటివి తెరపైకి తేవద్దనే విధంగా చంద్రబాబు వారికి సూచనలు చేశారు. కానీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అనంతరం పరిణామాలు మారిపోయాయి. జూ.ఎన్టీఆర్ సోదరికి కూకట్పల్లి అసెంబ్లీ టిక్కెట్ ఇచ్చారు. ఆమె పోటీ చేసి ఓడిపోయారు. సుహాసినికి టిక్కెట్ నేపథ్యంలో జూ.ఎన్టీఆర్, చంద్రబాబుల మధ్య సయోధ్య కుదురుతుందనే వాదనలు వినిపించాయి.