వరద బాధితులను కన్నెత్తయినా చూడలేదు.. మరి దుబ్బాకలో ప్రచారానికి వెళ్తారా.. కేసీఆర్ మదిలో ఏముంది..
సవాలక్ష ప్రశ్నలకు ఒకే ఒక్క గెలుపుతో సమాధానం చెప్పాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. కరోనా కాలంలో కనిపించకుండా పోయారన్న విమర్శలు,ఎల్ఆర్ఎస్పై వ్యతిరేకత,ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచుతున్నా పట్టించుకోవట్లేదన్న విమర్శలు,ఇక ఇప్పుడు వరద బాధితులను కన్నెత్తి కూడా చూడటం లేదన్న జనం ఆగ్రహం... వీటన్నింటికి దుబ్బాక ఉపఎన్నికలో గెలుపే సమాధానమని సీఎం భావిస్తున్నారు.
ఉపఎన్నికలో విజయం ద్వారా ఇప్పటికీ తమకే జనామోదం ఉందని నిరూపించాలనుకుంటున్నారు. అయితే దుబ్బాక ఉపఎన్నికలో కేసీఆర్ ప్రచారంలో పాల్గొంటారా.. లేదా అన్నది హాట్ టాపిక్గా మారింది. వరదలతో విలవిల్లాడుతున్న హైదరాబాద్ వాసులను విస్మరించి.. దుబ్బాకలో అడుగుపెడితే జనంలోకి ప్రతికూల సంకేతాలు వెళ్లే అవకాశం ఉందా అన్న కోణంలో కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
దుబ్బాకలో ఆ ఎఫెక్ట్ ఉంటుందా...
గత 12 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ జనజీవనం ఎంతలా అతలాకుతలమైందో తెలిసిందే. వందల సంఖ్యలో కాలనీలు నీట మునిగాయి. ఇప్పటికీ రోజులో ఒక్కసారైన వర్షం కురుస్తుండటంతో చాలా కాలనీలు ఇంకా వరదలోనే ఉన్నాయి. ఇంత జరిగినా... ముఖ్యమంత్రి కేసీఆర్ వరద బాధితుల కోసం ఒక్క ప్రెస్ మీట్ అయినా పెట్టలేదు... ఒక్క బాధితుడినైనా పరామర్శించలేదన్న విమర్శలున్నాయి. మరోవైపు దుబ్బాక ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసీఆర్.. అక్కడ ప్రచారం చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వరద బాధితుల వైపు కన్నెత్తయిన చూడకపోవడంతో... దుబ్బాకలో ఆ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా అన్న కోణంలో పార్టీ నేతలతో కేసీఆర్ చర్చిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ప్రతికూలతల నడుమ... జనం నమ్ముతారా...
హైదరాబాద్ వరదల నేపథ్యంలో గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలు,చెప్పిన మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వరద దృశ్యాలకు కేసీఆర్ మాటలను జోడించి సోషల్ మీడియాలో నెటిజన్లు విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు. హైదరాబాద్ నగరాన్ని డల్లాస్గా మార్చడమంటే ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్న అధికారులు,మంత్రులు కూడా జనం నుంచి చీవాట్లు,ఆగ్రహం చవిచూస్తున్నారు. వరద బాధితుల కోసం కేసీఆర్ ఆర్థిక సాయం ప్రకటించినప్పటికీ... స్వయంగా వాళ్లతో మాట్లాడి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి ప్రతికూలత నడుమ దుబ్బాకలో అడుగుపెట్టి... నియోజకవర్గ అభివృద్దికి హామీలిస్తే జనం నమ్ముతారా అన్న ప్రశ్న కూడా టీఆర్ఎస్ను వెంటాడుతోందన్న చర్చ జరుగుతోంది.
గెలుపే సమాధానం అన్న యోచనలో కేసీఆర్...
ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వంపై చాలా అంశాల్లో జనం నుంచి విమర్శలున్నాయి. కరోనా కాలంలో కనీసం జనానికి ముఖం కూడా చూపించకుండా ఫామ్ హౌస్కే పరిమితమయ్యారని ప్రతిపక్షాలు కేసీఆర్పై దుమ్మెత్తి పోశాయి. ఆ తర్వాత ఇదే చివరి ఛాన్స్ అంటూ ఎల్ఆర్ఎస్ స్కీమ్ తీసుకురావడంపై కూడా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కరోనా లాక్ డౌన్ కారణంగా అసలే ఆర్థిక కష్టాల్లో ఉన్న ప్రజలపై ఇదో భారం మోపారని చాలామంది ప్రభుత్వాన్ని విమర్శించారు. అటు పోతిరెడ్డిపాడు వివాదం ఉండనే ఉంది... ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టు సామర్థ్యం పెంచుతున్నా నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరించారని ప్రతిపక్షాలు విమర్శిస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు వరదలు... దాదాపు ఏడేళ్లుగా అధికారంలో ఉన్నా హైదరాబాద్ నగరంలో వరద నీటి సమస్యను ఎందుకు పరిష్కరించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఎన్ని విమర్శలైనా సరే... ఒకే ఒక్క గెలుపుతో పటాపంచలు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. దుబ్బాకలో గెలుపుతో ఇప్పటికీ తమకే జనామోదం ఉందని నిరూపించాలనుకుంటున్నారు.
దసరా తర్వాత ప్రచార బరిలో...
దుబ్బాకలో ప్రచారానికి సంబంధించి పార్టీ నేతలతో కేసీఆర్ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. దసరా తర్వాత ఇందుకు ముహూర్తం ఖరారు చేసే అవకాశం ఉంది. దుబ్బాకలో ఓటమిపాలైతే జనంలో వ్యతిరేకత మొదలైందన్న సంకేతాలు వెళ్తాయి కాబట్టి... ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగకూడదని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వరద బాధితులను పరామర్శించలేదన్న విమర్శలు ఇతరత్రా వాటిని పట్టించుకోకుండా... ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రచారంలో పాల్గొనాలని సీఎం భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటివరకూ అన్ని అసెంబ్లీ ఉపఎన్నికల్లోనూ విజయం సాధిస్తూ వచ్చినట్లుగానే ఈ ఉపఎన్నికను కూడా కైవసం చేసుకుని... జనంలో తమపై ఏమాత్రం వ్యతిరేకత లేదని నిరూపించాలనుకుంటున్నారు.