చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అన్న కేసీఆర్, తానే గిఫ్ట్ తీసుకుంటున్నాడా ఏందీ ?
హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మధ్య సవాళ్ల పర్వం కొనసాగింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసిన చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని లోక్సభ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ పదే పదే ప్రస్తావించారు. బాబుకు బహుమతి అందజేస్తామని స్పష్టంచేశారు. కానీ ఏపీలో చంద్రబాబుకు ఓటమి తప్పలేదు .. దాంతోపాటు కేసీఆర్ కూడా బొక్కబొర్లపడ్డాడు. కారు సర్కార్ పదహారు అనే నినాదాన్ని ఈ సారి ఓటర్లు పెద్దగా పట్టించుకోలేదు.
బాబు ప్రచారం .. రిటర్న్ గిఫ్ట్
డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్తో కలిసి చంద్రబాబు ప్రచారం చేశారు. దీంతో రిటర్న్ గిఫ్ట్ అంశాన్ని కేసీఆర్ ఎత్తుకున్నారు. ఏపీలో వచ్చి ప్రచారం చేస్తానని .. ఇక మీ పని అయినట్టేనని పేర్కొన్నారు. కేసీఆర్ విమర్శలకు చంద్రబాబు కూడా అదేరీతిలో కౌంటర్ ఇచ్చారు. కానీ ఫలితాల్లో మాత్రం చంద్రబాబుకు దిమ్మతిరిగింది. ఆ పార్టీ కేవలం 30 స్థానాల్లో లీడింగ్లో ఉండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తాము తిరిగి అధికారంలోకి వస్తామనే ఆ పార్టీ అంచనాలు తప్పాయి. కానీ చంద్రబాబుతోపాటు కేసీఆర్ కూడా రిటర్న్ గిఫ్ట్ కూడా తీసుకున్నాడా అనే వాదనలు వినిపస్తున్నాయి.
టాప్గేరులో కారు ..
తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదు. ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇక ఉప ఎన్నికల్లో అయితే ఆ పార్టీని కొట్టేనాథుడే లేడు. సాధారణ ఎన్నికల్లో కూడా కారు టాప్ గేరులో దూసుకెళ్లింది. 2014, 2018 సార్వత్రిక ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ విజయదుందుబి మోగించింది. అయితే లోక్సభ ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీకి మింగుడుపడటం లేదు. రాష్ట్రంలో అధికారం చేపట్టి .. విపక్ష ఎమ్మెల్యేలను చేర్చుకొని మరింత బలపడిన టీఆర్ఎస్ .. కేవలం 9 స్థానాలకు పరిమితం అవుతుందనే అంచనాలు ఆ పార్టీని కలవరానికి గురిచేస్తోంది. ఆ పార్టీ కారు పదహారు సర్కారు నినాదాన్ని ప్రజలు అంత విశ్వసించలేదు. బీజేపీ, కాంగ్రెస్కు చెరో నాలుగు సీట్లను కట్టబెట్టబోతున్నారు. అంటే దీనినిబట్టి చంద్రబాబుకు రిటర్న్ గిప్ట్ కాదు .. తనకు తానే గిప్ట్ తీసుకున్నాడా అనే వాదన వినిపిస్తుంది.
7 సీట్లు కోల్పోయింది ..
లోక్ సభ ఎన్నికల్లో 16 సీట్లు గెలుస్తామని టీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో 11 స్థానాలు గెలిచినందున .. తమకు మరో ఐదు సీట్లు కస్టమేమి కాదని లెక్కగట్టింది. వాస్తవానికి ఆ పార్టీకి ఉన్న క్యాడర్, పేరు కూడా ఆ స్థాయిలో సీట్లు వస్తాయనే చర్చ జరిగింది. కానీ ఊహించిన సీట్ల కన్నా 7 స్థానాలను కోల్పోవడం అంటే మాములు విషయం కాదు. ఆ పార్టీ డౌన్ ఫల్కు ఇదీ మొదటి అడుగు అనే ప్రత్యర్థులు కూడా విమర్శించే అవకాశం ఉంది. ఇందులో గులాబీ దళపతి కేసీఆర్ కూతురు కవిత ఉండటం గమనార్హం. ఇందూరు కోట నుంచి రెండోసారి బరిలోకి దిగిన కవిత .. అనుహ్యంగా పరాజయం అంచున నిలుస్తోంది. దీనికి కారణం టీఆర్ఎస్ అతి విశ్వాసం .. పసుపు బోర్డు ఏర్పాటుచేయకపోవడం. టీఆర్ఎస్, స్థానిక ఎంపీ కవిత వైఖరిని నిరసిస్తూ 175 మంది రైతులు బరిలో ఉన్నారు. వారు భారీగా ఓట్లు చీల్చి .. తమ బలమెంటో చూపించారు. దీనికితోడు బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ క్యాష్ చేసుకొని పోవడం బీజేపీకి కలిసొచ్చింది.