అరుణాచల్ గవర్నర్గా మోత్కుపల్లి?: తమిళనాడుకు ఆనందిబెన్!
న్యూఢిల్లీ: గత కొంత కాలంగా గవర్నరిగిరిపై కన్నేసిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు చివరకు తాను అనుకున్నది సాధించినట్లుగా కనిపిస్తోంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం.. అరుణాచల్ప్రదేశ్ గవర్నర్గా టీటీడీపీ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు నియమితులు కానున్నారు. దీనిపై కేంద్రం త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.
ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన టీడీపీకి ఒక గవర్నర్ పదవి ఇస్తామని గతంలో ప్రధాని హామీ ఇచ్చారు. అనివార్య కారణాలతో అది ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. కాగా, ఇటీవల కేంద్ర మాజీ మంత్రి నజ్మాహెప్తుల్లాతో పాటు నలుగురిని గవర్నర్లుగా నియమించారు. అప్పుడే మోత్కుపల్లిని కూడా గవర్నర్గా నియమించాలని కేంద్రం భావించినా.. ఏపీ ప్యాకేజీపై చర్చలు జరుగుతున్నందున పక్కనపెట్టింది.
ప్యాకేజీ ప్రకటన తర్వాత మోత్కుపల్లికి గవర్నర్ పదవి ఇస్తామని ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబుకు చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం ఖాళీ అయిన తమిళనాడు, అరుణాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ గవర్నర్ పదవులు త్వరలో భర్తీ చేయాలని భావిస్తున్న కేంద్రం ఇప్పటికే మోత్కుపల్లి బయోడేటాను తెప్పించుకున్నట్లు తెలిసింది. దీనిపై పీఎంవో అధికారులు, సీఎం చంద్రబాబుతో, మోత్కుపల్లితో సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది.
కాగా, తమిళనాడు గవర్నర్గా గుజరాత మాజీ సీఎం ఆనందిబెన్ పటేల్ను నియమించే అవకాశాలు ఉన్నాయి. ఇటీవలే గవర్నర్గా రోశయ్య తన పదవీ కాలం పూర్తి కావడంతో దిగిపోయారు. దీంతో మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావుకు తమిళనాడు అదనపు బాధ్యతలు అప్పగించారు.
ఇది ఇలా ఉండగా, ఒకవేళ అరుణాచల్ప్రదేశ్ రాష్ట్రానికి మోత్కుపల్లిని నియమించకపోతే.. మణిపూర్ గవర్నర్ నజ్మాహెప్తుల్లాను అరుణాచల్ప్రదేశ్కు మార్చి.. ఆయనను అక్కడ నియమించే అవకాశాలూ ఉన్నాయి. గత కొంత కాలంగా గవర్నర్గిరి టిడిపి అధినేత చంద్రబాబునాయుడుతో మోత్కుపల్లి లాబీయింగ్ చేస్తున్న విషయం తెలిసిందే.