ఉత్తమ్కు రేవంత్ సహకరిస్తాడా..? హుజూర్ నగర్ కాంగ్రెస్లో ఏం జరగబోతోంది?
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తి రేపుతుంటాయి. సాదారణ ఎన్నికలప్పుడు కానీ, ఉప ఎన్నికలప్పుడు గానీ పార్టీ వ్యవహారం కాస్త భిన్నంగా ఉంటుంది. నేతల మద్య సఖ్యత ఉన్నట్టే కనిపిస్తుంది కాని ప్రచారంలో మాత్రం ఎవ్వరూ కనబడరు. ఆశించిన నేతలు కాకుండా ఎవరో అకస్మాత్తుగా ప్రచారంలో తళుక్కుమంటుంటారు. బహిరంగ సభల్లో అసలు విషయం పక్కన పెట్టి నేతలు ఒకరి మద్య ఒకరు ఘాటు ఆరోపణలు గుప్పించుకుంటారు. ఇదేంటీ స్వామీ అంటే కాంగ్రెస్ లో అలాంటివి సహజమే అని లైట్ గా తీసుకుంటారు నేతలు. ఇప్పుడు అలాంటి సందర్బమే కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తోంది. ఇద్దరు ఉద్దండ నేతల మద్య ఇగో సమస్య తలెత్తి హుజూర్ నగర్ ఉప ఎన్నిక పై ప్రభావం చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఉత్కంఠగా హుజూర్ నగర్ ఉప పోరు..! నేతల మద్య మాటల జోరు..!!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వివాదాలకు, అంతర్గత కీచులాటలకు కొదవ ఉండదు. ఒక్కోసారి అవి శృతిమించి బజారున కూడా పడుతుంటాయి. ఆ తర్వాత కొన్ని రోజులకు అన్ని సర్ధుకున్నట్టు కనిపిస్తుంటాయి. ఇదే అంశంపై కొంత మంది సీనియర్ నేతలు గమ్మత్తైన సమాధానం చెప్తుంటారు. కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత వివాదాలు సర్వ సాదారణమని, అది కొన్ని సందర్బాల్లో పార్టీకి మేలు చేస్తుందని ఉదాహరణలు కూడా చెప్పుకొస్తుంటారు. గల్లీ లో మొదలైన పంచాయితీలు కొన్ని సందర్బాల్లో ఢిల్లీ వరకూ చేరుతుంటాయి. ఢిల్లీ పెద్దల సమక్షంలో కొన్ని పంచాయితీలు పరిష్కారం కాబడతాయంటే ఆశ్చర్యం వేయక మానదు.
గెలుపే లక్ష్యం..! అందరూ సహకరించాలన్నదే అదిష్టానం ధ్యేయం..!!
ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఫోకస్ అంతా హుజూర్ నగర్ ఉప ఎన్నిక మీదే ఉంది. కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్తానం కాబట్టి ఎలాగైన గెలవాలనే ధీమాతో ఉంది. తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు కూడా హుజూర్ నగర్ లో గెలుస్తామనే హామీని అదిష్టానానికి ఇచ్చినట్టు తెలుస్తోంది. వ్యక్తిగత కారణాలు పక్కన పెట్టి హుజూర్ నగర్ ఉప ఎన్నికలో నేతలందరూ సమిష్టిగా పనిచేయాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆదేశాలు జారీ చేస్తోంది. దీనికి తోడు అదిస్టానం కూడా ముఖ్యనేతలపైన హుజూర్ నగర్ గెలుపు బాద్యతలను అప్పగించినట్టు తెలుస్తోంది. అసలు చిక్కంతా ఇక్కడే వచ్చినట్టు నేతలు భావిస్తున్నారు. నేతల మద్య మనస్పర్థలు, ఇగోలు పక్కన పెట్టాలని అదిస్టానం సూచించడం కొంత మంది నేతలకు ఇబ్బందిగా పరిణమించింది.
టీపిసిసిలో నేతల మద్య ఇగో సమస్య..! తగ్గించుకుంటే మంచి ఫలితాలు..!!
టీపిసిసి ప్రసిడెంట్ రేసులో ముందున్న రేవంత్ రెడ్డి పాత్ర హుజూర్ నగర్ ఉప ఎన్నికలో కీలకం కానుందనే చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డి ఓ రెండు మూడు బహిరంగ సమావేశాలకు హాజరైతే అక్కడ ప్రజల మైండ్ సెట్ మారే అవకాశాలు ఉన్నట్టు, కాంగ్రెస్ పార్టీకి అది కలిసొచ్చే అంశంగా పరిణమించొచ్చనే చర్చ తారా స్దాయిలో జరుగుతోంది. టీపిసిసి ప్రసిడెంట్ ఉత్తమ్ కూమార్ రెడ్డి భార్య, ప్రస్తుత హుజూర్ నగర్ కాంగ్రెస్ అభ్యర్ధి పద్మావతి కూడా ఇదే అంశాన్ని తన సన్నిహితుల దగ్గర ప్రస్ధావించడం విశేషం. ఐతే రేవంత్ రెడ్డిని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రచారానికి ఆహ్వానిస్తారా అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
రేవంత్ రెడ్డి పై ఫోకస్..! హుజూర్ నగర్ పై ప్రభావం చూపనున్న రేవంత్ ప్రచారం..!!
ఇగోలు పక్కన పెట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డిని హుజూర్ నగర్ ఉప ఎన్నిక ప్రచారానికి ఆహ్వానిస్తే పార్టీ గెలుపు తీరాలకు చేరడం ఖాయమనే చర్చ జరుగుతోంది. వ్యక్తిగత పట్టింపులకు లొంగిపోయి, ప్రయోగం చేస్తామంటే కాంగ్రెస్ పార్టీ కి చేదు అనుభవం ఎదురుకాక తప్పదనే చర్చ కూడా జరుగుతోంది. గతంలో జరిగిన ఎన్నికల్లో ట్రక్కు గుర్తు వల్లే ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచారని ఒకటికి వంద సార్లు చెప్పుకొస్తున్న గులాబీ పార్టీ వాదనను తప్పదని నిరూపించాలంటే ఈ సారి కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరాలని కాంగ్రెస్ శ్రేణులు పట్టుబడుతున్నాయి. అందుకోసం రేవంత్ రెడ్డి లాంటి ప్రజాధరణ ఉన్న నేతలు హుజూర్ నగర్ ఉపఎన్నిక ప్రచార రంగంలో ఉపయోగించుకోవాలనే డిమాండ్ కాంగ్రెస్ కార్యకర్తల నుండి బలంగా వినిపిస్తోంది. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.