రేవంత్ రెడ్డికి బిగుస్తున్న ఉచ్చు..? ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం..
తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం మొదటిసారి అధికారంలోకి వచ్చిన ఏడాదికే 'ఓటుకు నోటు' అనే సంచలన కేసు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. అప్పట్లో పెనుసంచలనం సృష్టించిన ఈ కేసు తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కీలక ఆధారాలతో ఏసీబీ మొత్తం 960 పేజీలతో కూడిన చార్జిషీట్ను దాఖలు చేసింది. దీనిపై మంగళవారం ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది.
ఈ కేసులో ఎంపీ రేవంత్ రెడ్డి ఏ-1గా ఉన్నారు. ప్రస్తుతం డ్రోన్ కేసులో ఆయన చర్లపల్లి జైల్లో ఉండటంతో రేపు విచారణకు హాజరవుతారా లేదా అన్న దానిపై స్పష్టత లేదు. ఇప్పటికే డ్రోన్ కేసుతో సతమవుతువుతున్న రేవంత్ రెడ్డికి ఓటుకు నోటు కేసులో ఎలాంటి పరిణామాలు ఎదురుకాబోతున్నాయన్నది ఉత్కంఠ రేపుతోంది. ఏసీబీ ఫైల్ చేసిన చార్జిషీట్లో నిందితుల పాత్రపై కీలక ఆధారాలు పొందుపరిచినట్టు తెలుస్తోంది. ఇదే కేసుకు సంబంధించి వెలుగుచూసిన ఆడియో టేపుల సంభాషణపై ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు కూడా కోర్టుకు అందింది. ఆ టేపుల్లో సంభాషణలు టీడీపీ అధినేత చంద్రబాబువే అన్న ఆరోపణలున్న నేపథ్యంలో రిపోర్టులో ఏం తేలిందన్నది ఉత్కంఠను రేపుతోంది.
ఐదేళ్ల క్రితం 2015లో ఓటుకు నోటు కేసు బయటపడింది. టీడీపీ తరుపున వేం నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించుకునేందుకు ఆ పార్టీ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రూ.50లక్షలు ఇవ్వజూపింది. ఇదే క్రమంలో రేవంత్ రెడ్డి డబ్బులతో సహా స్టీఫెన్సన్ ఇంటికెళ్లి ఆ డబ్బును ఆఫర్ చేశారు. అయితే అప్పటికే స్టీఫెన్సన్ ఏసీబీకి సమాచారం ఇవ్వడంతో.. రేవంత్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆ తర్వాత రేవంత్ జైలుకెళ్లడం.. అప్పుడు ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు,తెలంగాణ సీఎం కేసీఆర్ మధ్య తీవ్ర మాటల యుద్దం జరిగింది. తదనంతర పరిణామాల్లో చంద్రబాబు కూడా తన మకాంను విజయవాడకు మార్చేయడంతో.. కేసీఆర్ కూడా కేసుపై ఫోకస్ తగ్గించేసినట్టు కనిపించింది. తాజాగా మరోసారి ఈ కేసు తెరపైకి రావడంతో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.