పోటీలో కాంగ్రెస్ సీనియర్లు జానారెడ్డి, డికే అరుణ!: లిస్ట్లో రేవంత్ రెడ్డి, ఖమ్మంపై రేణుకా పట్టు
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 17 లోకసభ నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి కారణంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఆలస్యమైంది. కూటమి ఓటమికి ఇది కూడా కీలక కారణం. ఆ చేదు అనుభవం నేపథ్యంలో అభ్యర్థులను సాధ్యమైనంత త్వరగా ప్రకటించాలని భావిస్తోంది.
'హరీష్ రావు ఓ టైమ్ బాంబులాంటివాడు, కేటీఆర్తో సమన్వయం చేయాలని కేసీఆర్ ఆలోచన'
కీలక నియోజకవర్గాలలో సీనియర్లను బరిలోకి దింపాలని భావిస్తోంది. రెండు మూడు రోజుల్లో దాదాపు అందరు అభ్యర్థులను ఖరారు చేయాలని గట్టిగా నిర్ణయించుకుంది. లోకసభ బరిలో జానారెడ్డి, షబ్బీర్ అలీ, రేణుకా చౌదరి, మధుయాష్కీ, డీకే అరుణ వంటి సీనియర్లు బరిలోకి దిగనున్నారు. అభ్యర్థులను ఎంత త్వరగా ప్రకటిస్తే అంత మేలు జరుగుతుందని భావిస్తున్నారు. బుధవారం స్క్రీనింగ్ కమిటీ తుది కసరత్తు చేయనుంది. ఈ రోజు (మంగళవారం) రాత్రి పీసీసీ చీఫ్ తదితరులు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులను ముందుగానే ప్రకటించాలని నిర్ణయించింది.
వరంగల్ బరిలో మందకృష్ణ
చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, సికింద్రాబాద్ నుంచి అంజన్ కుమార్ యాదవ్, జహీరాబాద్ నుంచి మదన్ మోహన్ రావు, భువనగిరి నుంచి మధుయాష్కీ, వరంగల్ నుంచి ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగలను బరిలోకి దింపనున్నారని తెలుస్తోంది. గతంలో నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలిచిన యాష్కీ.. 2014లో కల్వకుంట్ల కవిత చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు ఆయన భువనగిరి నుంచి ఆసక్తి కనబరుస్తున్నారు.
తెరపైకి జానారెడ్డి పేరు
హైదరాబాద్ లోకసభ స్థానం నుంచి అజహరుద్దీన్ పేరును పరిశీలిస్తున్నారు. ఆయన నో చెబితే ఫిరోజ్ ఖాన్ను పోటీ చేయించాలని భావిస్తున్నారు. నల్గొండ నుంచి జానారెడ్డితో పోటీ చేయించాలని భావిస్తున్నారు. కానీ ఈ స్థానం కోసం కోమటిరెడ్డి వెంకట రెడ్డి చాలా రోజులుగా పట్టుబడుతున్నారు. మరో ఇద్దరు ముగ్గురు ఆసక్తి చూపిస్తున్నారు. కరీంనగర్ నుంచి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పేరు దాదాపు ఖరారయిందని తెలుస్తోంది.
రేణుకా చౌదరికి టిక్కెట్ దక్కేనా
ఖమ్మం నుంచి రేణుకా చౌదరి, పొంగులేటి సుధాకర్ రెడ్డిలు రేసులో ఉన్నారు. తనకు ఈ సీటు కావాల్సిందేనని రేణుక గట్టిగా పట్టుబడుతున్నారు. నిజామాబాద్ నుంచి షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డిలలో ఒకరిని నిలబెట్టాలని చూస్తున్నారు. నాగర్ కర్నూలు నుంచి నంది ఎల్లయ్య, సంపత్ కుమార్ల పేరు పరిశీలనలో ఉంది. కానీ మాజీ ఎంపీ మల్లు రవి ప్రచారం ప్రారంభించడం గమనార్హం.
డీకే అరుణ, రేవంత్ రెడ్డిలు బరిలోకి దిగుతారా?
అదిలాబాద్ నుంచి పోటీ చేసేందుకు మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ ప్రయత్నాలు చేస్తున్నారు. సోయం బాబూరావు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్, బెల్లయ్య నాయక్, రాములు నాయక్ తదితరులు రేసులో ఉన్నారు. మెదక్ నుంచి గాలి అనిల్ కుమార్, జగ్గారెడ్డి సతీమణి ఆసక్తి చూపిస్తున్నారు. పెద్దపల్లి నుంచి కవ్వంపల్లి సత్యనారాయణ, శ్రీనివాస్, మల్కాజిగిరి నుంచి కూన శ్రీశైలం గౌడ్, మహబూబ్ నగర్ నుంచి జైపాల్ రెడ్డి, డీకే అరుణ, రేవంత్ రెడ్డిల పేర్లు వినిపిస్తున్నాయి. వారు ఆసక్తి చూపించకుంటే వంశీచంద్ రెడ్డి వంటి పేర్లు కూడా పరిశీలిస్తున్నారు.