కేసీఆర్ ఫ్యామిలీ జైలుకు పోక తప్పదు.. అప్పటిదాకా నిద్రపోను.. ఎంపీ కోమటిరెడ్డి విమర్శలు
Recommended Video
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం మొత్తాన్నీ జైలుకు పంపేదాకా నిద్రపోనని కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శపథం చేశారు. కేసీఆర్ ఫ్యామిలీ అక్రమాలు, చీకటి వ్యవహారాలకు సంబంధించిన ఆధారాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), విజిలెన్స్కు అందజేస్తానన్నారు. దీపిపై పార్లమెంట్ లోనూ పోరాడుతానని, చేసిన నేరాలకు వాళ్లంతా ఏదో ఒక రోజు జైలుకు పోక తప్పదని ఆన్నారు.
మంగళవారం హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో మీడియాతో మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి.. కేసీఆర్ ఫ్యామిలీ రాష్ట్రాన్ని నిలువునా దోచేయడమే కాకుండా, మున్సిపల్ ఎన్నికల్లో తీవ్రస్థాయి నేరాలకు పాల్పడిందని ఆరోపించారు. ''కేసీఆర్, కేటీఆర్ సిగ్గుఎగ్గూ లేకుండా పనిచేస్తున్నారు. వాళ్లను వదిలిపెట్టే సమస్యేలేదు. ఊరూరు వాళ్ల బండారాలు బయటపెడతాం''అని హెచ్చరించారు.
తన భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని తొమ్మిది మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చిందని, అయితే టీఆర్ఎస్ మాత్రం ఎక్స్ అఫీషియో ఓట్లతో ఏడు మున్సిపాలిటీలను కైవసం చేసుకుందని కోమటిరెడ్డి చెప్పారు. కేసీఆర్ అడుగులకు మడుగులొత్తుతూన్న పోలీసులు.. రజాకార్లకంటే దారుణంగా వ్యవహరించారని మండిపడ్డారు.
మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి మేయర్లు, చైర్మన్ల ఎంపిక ముగిసినదాకా కేసీఆర్ ఫ్యామిలీని ఉద్దేశించి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వరుసగా తీవ్ర విమర్శలు చేస్తూవచ్చారు. అభివృద్ధి పేరుతో తెలంగాణను నాశనం చేసిన కేసీఆర్ కుటుంబాన్ని ప్రగతి భవన్ నుంచి లాక్కొచ్చి పంజాగుట్ట చౌరస్తాలో మెట్రో పిల్లర్కు కట్టేసి కొట్టినా తప్పులేదని ఒకసారి... మున్నిపల్ ఎన్నికల్లో అధికారాన్ని అడ్డంపెట్టుకుని పశువుల కంటే హీనంగా ప్రవర్తిస్తోన్న కేసీఆర్, కేటీఆర్ ను కాల్చి చంపినా తప్పులేదని మరోసారి విమర్శించిన కోమటిరెడ్డి.. ఇప్పుడా ఫ్యామిలీని జైల్లో పెట్టేదాకా నిద్రపోనని శపథం చేశారు.