పంచాయతీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ, రెండ్రోజుల్లో దరఖాస్తు పత్రాలు: కోదండ
హైదరాబాద్: గత నెలాఖరులో నిర్వహించిన తెలంగాణ జన సమితి ఆవిర్భావ సభ విజయవంతమైందని ఆ పార్టీ అధినేత కోదండరాం బుధవారం అన్నారు. ఇక పార్టీ నిర్మాణంపై తాము దృష్టి సారిస్తామని చెప్పారు.
రానున్న పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని కోదండరాం చెప్పారు. ఆసక్తి ఉన్న వారు తెలంగాణ జన సమితికి దరఖాస్తులు పంపించాలని సూచించారు. రెండు రోజుల్లో దరఖాస్తు పత్రాలను ప్రజలకు అందుబాటులో ఉంచుతామన్నారు.
పార్టీ కార్యకర్తలు, నేతలు ప్రజలను జాగృతం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ మహిళా విభాగాన్ని పటిష్టం చేస్తామన్నారు. దివ్యాంగుల హక్కుల చట్టాన్ని ప్రభుత్వం సక్రమంగా అమలు చేయడం లేదన్నారు.
ఈ చట్టం అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామన్నారు. ఉద్యోగులకు పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలని, ఉద్యోగులకు తమ పూర్తి మద్దతు ఉంటుందని మరో నేత కపిలవాయి దిలీప్ కుమార్ అన్నారు.