ఉస్మానియా ఆస్పత్రి భవనం సురక్షితమే, కూల్చాలనుకుంటే లీగల్ చర్యలు: ఇంటాక్
న్యూఢిల్లీ: హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రి భవనం పటిష్టంగానే ఉందనీ, దానిని కూల్చివేయాలనే ఆలోచనను తెలంగాణ ప్రభుత్వం విరమించుకోవాలని 'భారతీయ కళలు, సాంస్కృతిక వారసత్వ జాతీయ ట్రస్టు'(ఇంటాక్) విజ్ఞప్తి చేసింది.
ఆఖరి నిజాం నవాబు ఉస్మాన్ ఆలీఖాన్ హయాంలో 90 ఏళ్ల క్రితం నాటి చారిత్రక భవనంపై ఇంటాక్ హైదరాబాద్ శాఖ సమగ్ర అధ్యయనం చేసిందని ఇంటాక్ అధ్యక్షుడు, విశ్రాంత మేజర్ జనరల్ ఎల్కె గుప్తా తెలిపారు.
‘భవనాలు పటిష్టంగానే ఉన్నాయని తేలింది. కూల్చివేత ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకోకపోతే చట్టపరంగానైనా అడ్డుకుంటాం' అని ఎల్కె గుప్తా ఆదివారం ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ తెలిపారు. దేశంలో అనేకచోట్ల వారసత్వ కట్టడాల కూల్చివేత ప్రయత్నాలను న్యాయస్థానాల ఉత్తర్వులతో తాము అడ్డుకున్న విషయాన్ని గుర్తు చేశారు.
ఇలాంటి పరిస్థితులే ఉత్పన్నమయినప్పుడు.. బెంగళూరులోని చారిత్రక ‘అటార కచేరీ'ని ఎలా పరిరక్షించగలిగిందని గుప్తా వివరించారు. ‘అటార కచేరిని 1860లో నిర్మించారు. 1980ల ప్రాంతంలో ఈ హెరిటేజ్ నిర్మాణాన్ని కూల్చివేయాలని అప్పటి కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది. దీనికి నిరసనగా కన్నడిగులు పెద్దఎత్తున ముందుకొచ్చారు.
ఈ నిర్మాణాన్ని కాపాడాలంటూ దాఖలైన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని పరిగణనలోకి తీసుకొని.. కర్ణాటక హైకోర్టు అప్పట్లో చారిత్రక తీర్పును వెలువరించింది. దానివల్ల అనంతర కాలంలో అనేక చారిత్రక కట్టడాలు కూల్చివేత ప్రమాదం నుంచి బయటపడ్డాయి' అని గుప్తా గుర్తుచేశారు.
ఇలా.. చిన్న ‘పిల్'తో అనేక పురాతన కట్టడాలను రక్షించుకోగలిగినట్లు ఆయన చెప్పారు. సహజసిద్ధంగా గాలి, వెలుతురు ప్రసరించేలా అద్భుతంగా నిర్మించిన ఆస్పత్రిని కూల్చివేయాలనుకోవడం తగదని ఇంటాక్ హైదరాబాద్ శాఖ అధ్యక్షురాలు అనూరాధరెడ్డి చెప్పారు.