చంద్రబాబు V/S కేసీఆర్ : తెలంగాణలో ముందస్తు వస్తే టీడీపీ కింగ్మేకర్ అవుతుందా..?
Recommended Video
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతున్న అంశం ముందస్తు ఎన్నికలు. ఇంకా సాధారణ ఎన్నికలకు కొన్ని నెలలు సమయం ఉండగానే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలపై సంకేతాలు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ కేసీఆర్ అనుకున్నట్లుగానే తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళితే దీన్ని అడ్వాంటేజ్గా తీసుకోవాలని భావిస్తున్నారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. తెలంగాణలో టీడీపీకి కొన్ని చోట్ల ఇప్పటికీ బలమైన క్యాడర్ ఉంది. అక్కడ టీఆర్ఎస్పై విజయం సాధించి కేసీఆర్కు చెక్ పెడదాం అనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా చంద్రబాబు మానసపుత్రిక నగరమైన హైదరాబాద్పైనే ఆయన ఎక్కువగా దృష్టి సారించారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 24 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఓల్డ్ సిటీ తప్పనిస్తే హైదరాబాద్లో ఎక్కువగా సెటిలర్లే ఉన్నారు.ఖమ్మంలో కూడా నివసించే ప్రజలు తెలంగాణ కన్నా ఏపీవైపే మొగ్గుచూపుతారు. ఎందుకంటే ఆ జిల్లా ఏపీ సరిహద్దులో ఉడటం ఒక కారణమైతే అక్కడ కూడా సెటిలర్లు పెద్ద సంఖ్యలో ఉండటం మరోకారణం.ఇదిలా ఉంటే మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్, నిజామాబాద్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లాల్లో తెలుగుదేశానికి బలమైన క్యాడర్ ఉందని టీడీపీ భావిస్తోంది.
తెలంగాణ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు జరిగితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇక్కడ ప్రచారం చేసేందుకు తగిన సమయం ఉంటుందని టీడీపీ భావిస్తోంది. తద్వారా సెటిలర్లను ఆకర్షించవచ్చనేది వారి ఆలోచనగా ఉంది. దీంతో హైదరాబాద్లో టీడీపీ కొన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది. ఇలా కాకుండా ఏపీ తెలంగాణలకు ఒకే సారి లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు జరిగితే మాత్రం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏపీకే పరిమితం అవుతారు. ఇదిలా ఉంటే తెలంగాణలో టీడీపీ కొంత ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటోంది. ఇందులో భాగంగానే నేతలు కూడా ఈ ఎన్నికల్లో పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు చేసేందుకు సిద్ధంగా లేనట్లుగా తెలుస్తోంది.అయితే తెలంగాణకు ముందస్తు ఎన్నికలు వస్తే టీడీపీ బలంగా ఉండి గెలుస్తాం అనే చోట్ల పార్టీ డబ్బులు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉంది.
తెలంగాణ టీడీపీ నేతల ప్రకారం ఒక 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ బలంగా ఉందని... అందులో 20 సీట్లు గెలిచే అవకాశం ఉందని భావిస్తున్నారు.ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారి టీఆర్ఎస్లో చేరినప్పటికీ క్యాడర్ మాత్రం తెలుగుదేశం వెంటే ఉందని తెలంగాణ టీడీపీ నేతలు చెబుతున్నారు. ఒకవేళ కాంగ్రెస్ టీడీపీలు కలిసి పోటీచేస్తే ఎన్నికల్లో తామే విజయం సాధిస్తామని ఒక టీడీపీ నేత విశ్వాసం వ్యక్తం చేశారు. టీడీపీ 20 సీట్లు తెలంగాణాలో సాధించగలిగితే తామే కింగ్ మేకర్లం అవుతామని గతంలో పలుమార్లు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు సొంతంగా మెజార్టీ సాధించలేవని చంద్రబాబు అంచనా వేస్తున్నారు. కర్నాటకలో ఎలా అయితే ఫలితాలు వచ్చాయో అదే తరహా రిజల్ట్స్ తెలంగాణలో వస్తాయని చంద్రబాబు అంచనా వేస్తున్నారు.