రేవంత్ టీడీపీని చీలుస్తారా?: టీఆర్ఎస్తో పొత్తు యోచన బాబుదే!
వచ్చే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీతో పొత్తుకు టీడీపీ అధినేత చంద్రబాబు సిద్దపడినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకునే అంశం తెలంగాణ టీడీపీలో సంక్షోభానికి దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పొత్తు విషయంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న, వ్యవహరిస్తున్న తీరు పార్టీలోని ఓ వర్గానికి మింగుడుపడటం లేదు.
అదే జరిగితే ఒక బలమైన సామాజిక వర్గ నేతలు టీడీపీకి తప్పనిసరిగా దూరం అవుతారని సంకేతాలు కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్తో పొత్తు ఉంటుందన్న వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డితోపాటు ఆయన సామాజిక వర్గం నేతలు టీడీపీని వీడాలనే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
పొత్తు అనివార్యమన్న సంకేతాలు కొనసాగితే వీలైనంత త్వరగా భవిష్యత్ ప్రణాళిక నిర్ణయించుకోవాలన్న నిర్ణయానికి వారు వచ్చినట్లు సమాచారం. ఇటీవల చంద్రబాబుతో తెలంగాణ టీడీపీ నేతల సమావేశం మరునాడే రేవంత్రెడ్డి, టీఆర్ఎస్ పార్టీతో పొత్తును వ్యతిరేకిస్తున్న ఇతర నేతలతో సమావేశమైనట్లు విశ్వసనీయంగా తెలిసింది. రెడ్డి సామాజిక వర్గం తమకు దూరం అవుతుందన్న ఆలోచనతోనే భవిష్యత్ ప్రయోజనాల పరిరక్షణ కోసం కమ్మ సామాజిక వర్గం మద్దతు కోసం.. టీడీపీతో కలిసి పనిచేసేందుకు సిద్ధమన్న సంకేతాలను సీఎం కేసీఆర్ పంపారు. అసలు ఈ ఆలోచన టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుదేనని సమాచారం.
భవిష్యత్పై టీటీడీపీ నేతలు నజర్
ఇటీవల ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో మాజీ మంత్రి పరిటాల రవీంద్ర తనయుడు శ్రీరాం వివాహానికి వెళ్లిన తెలంగాణ సీఎం కేసీఆర్.. టీడీపీ నేతలతో ప్రత్యేకించి ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ తదితరులతో భేటీలో ఆంతర్యం ఇదేనని వార్తలొచ్చాయి. దీంతో నష్టం జరుగుతుందేమోనన్న ఆందోళనతో ఆగమేఘాలపై భాగ్యనగరానికి చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. తెలంగాణ నేతలతో సమావేశమై.. పొత్తులపై ఇప్పటికిప్పుడు చర్చించొద్దని, అవసరమైనప్పుడు నిర్ణయం తీసుకుందామని నచ్చజెప్పారని సమాచారం. అలా దాటవేత వ్యూహం అనుసరించారంటేనే ఆయన మదిలో ఆ ఆలోచన ఉన్నదని తెలుస్తోంది. ఏడాదిన్నర ముందు.. ప్రత్యేకించి టీఆర్ఎస్ నాయకత్వంతో ఉప్పూ నిప్పూగా సాగుతున్న ఘర్షణాత్మక వాతావరణంలో పొత్తు సంగతి బయటపడితే పార్టీకి నష్టం జరుగుతుందని ఆయన భావించారు. ఆయన ఊహించినట్లే నాయకులు కూడా తమ భవిష్యత్ రాజకీయంపై ద్రుష్టి సారించారా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
Recommended Video
కోదండరాంపై నోరు పారేసుకున్న సీఎం కేసీఆర్
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఇటీవలి కాలంలో రెడ్ల సామాజిక వర్గం అంటే భగ్గున మండిపడుతోంది. అధికారం కోసం రెడ్లు అర్రులు చాస్తున్నారన్న కోణంలో ప్రచారంచేయబోయి గులాబీ పార్టీ శ్రేణులు ఎదురు దెబ్బ తిన్నాయి. సాక్షాత్ సీఎం కేసీఆర్ కూడా ఇటీవల అసెంబ్లీలో విపక్ష నేత జానారెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఉద్యమ సమయంలో చేదోడు వాదోడుగా ఉంటూ ప్రజల్లో ఉద్యమ వేడిని రగిల్చిన రాజకీయ ఐకాస చైర్మన్ కోదండరాంపై సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. అంతకు ముందు నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని జేఏసీ ఆందోళనకు శ్రీకారం చుడితే.. కోదండరాంను హౌస్ అరెస్ట్ చేయడమే కాక.. అర్థరాత్రి ఆయన ఇంటిపై పోలీసులు దాడి చేసి విధ్వంసకాండ స్రుష్టించిన ఘనత తెలంగాణ ప్రజల మనో ఫలకం నుంచి తప్పిపోలేదు. రెడ్లు అధికారం కోసం ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నారని, వారిని విలన్లుగా చేయాలని ఇటీవల ఒక టీవీ చానెల్ చర్చాగోష్టిలో పాల్గొన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు విఫల యత్నం చేశారు.
కాంగ్రెస్ పార్టీలో చేరికపై ఆలోచించుకోవాలన్న రేవంత్
చంద్రబాబుతో భేటీ తర్వాత మరుసటి రోజు రేవంత్ రెడ్డి నిర్వహించిన భేటీలో పాల్గొన్న వరంగల్ జిల్లా సీనియర్ నేత ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే పొత్తు ఉందన్న అనుమానాలు నిజమయ్యే అవకాశం ఉందని, అదే జరిగితే ముందే భవిష్యత్ నిర్ణయించుకోవడం మంచిదని పేర్కొన్నట్టు తెలిసింది. చంద్రబాబుతో మరోసారి సమావేశమయ్యాకే నిర్ణయం తీసుకుందామని మహబూబ్నగర్ జిల్లా సీనియర్ నేత ఒకరు సూచించినా ఇతరులు ఆయనతో ఏకీభవించలేదు. పొత్తు విషయంలో స్పష్టమైన వైఖరి బయటపెట్టలేదంటేనే పొత్తు ఉన్నట్లు లెక్క.. అలాంటప్పుడు మరోమారు సమావేశమైనా ప్రయోజనం ఏమిటన్నది వారి వాదన. కాంగ్రెస్లో చేరే అంశంపైనా చర్చ జరిగింది. అయితే ఇప్పుడే ఈ విషయంలో ఓ నిర్ణయానికి రావడం మంచిది కాదని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం.
ఖమ్మంలో పునాదులు కాపాడుకోవచ్చని ఆశ
తెలంగాణలో పార్టీ మనుగడ కొనసాగించాలంటే టీఆర్ఎస్తో పొత్తు అనివార్యమని టీటీడీపీలో ఓ వర్గం గట్టిగా కోరుతోంది. పార్టీని నమ్ముకుని ఉన్నవారికి ఏవో కొన్ని సీట్లు కేటాయిస్తే పార్టీ మనుగడకు ఇబ్బంది ఉండదని, ఖమ్మం జిల్లా వంటి చోట్ల పార్టీ పునాదులను కాపాడుకోవచ్చని ఆ వర్గం నేతలు చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారు. చంద్రబాబు సలహాలు, సూచనల మేరకే ఓ వర్గం నుంచి ఇలాంటి ప్రతిపాదనలు వస్తున్నాయని, అందువల్ల పొత్తు విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని రేవంత్ వర్గం చెబుతోంది. పొత్తులో భాగంగా ఖమ్మం లోక్సభ సీటుతోపాటు 15 అసెంబ్లీ సీట్లు కేటాయించేందుకు సుముఖంగా ఉన్నట్లు టీఆర్ఎస్ నాయకత్వం నుంచి టీడీపీకి సంకేతాలు అందినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే ముఖ్య నేతలు ఉన్న నియోజకవర్గాల్లో వారికి సీట్లు కేటాయించవచ్చని టీడీపీ నాయకత్వం, తద్వారా మరోసారి తాము క్రియాశీలకం అవుతామని టికెట్ ఆశిస్తున్న నేతలు భావిస్తున్నారు. దీనివల్లే సీనియర్ నేతలు ఎల్.రమణ, మోత్కుపల్లి నర్సింహులుతోపాటు పలువురు నేతలు పొత్తు ప్రతిపాదనను సమర్థిస్తున్నారు. ‘పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే టీఆర్ఎస్తో పొత్తు ఖాయమనిపిస్తోంది. అదే జరిగితే మేం పార్టీని వీడటం తప్ప మరో మార్గం లేదు''అని నల్లగొండ జిల్లా మాజీ ఎమ్మెల్యే ఒకరు అన్నారు.
టీడీపీ నుంచి వీడేది వీరేనా..
తమ పార్టీలో చేరాలంటూ టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డికి కాంగ్రెస్కు చెందిన సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఆఫర్ ఇచ్చినట్లు తెలిసింది. ఇటీవల రేవంత్ నివాసంలో జరిగిన విందు సమావేశానికీ సదరు నేత హాజరయ్యారు. టీఆర్ఎస్ను ఎదుర్కొనేందుకు వ్యతిరేక శక్తులన్నీ కలిస్తే బాగుంటుందని ఆ నేత రేవంత్కు సూచించినట్లు తెలిసింది. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఈ సీనియర్ నేత రేవంత్కు దగ్గరి బంధువు కూడా. ఈ విషయంలో తనకు అనేక అనుమానాలు ఉన్నాయని, వాటిని నివృతి చేసుకుంటే గానీ ఓ నిర్ణయానికి రాలేనని రేవంత్ వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఒకవేళ రేవంత్ టీడీపీని వీడాలనుకుంటే ఉమా మాధవరెడ్డి, రావుల చంద్రశేఖర్రెడ్డి, వేం నరేందర్రెడ్డి, రేవూరి ప్రకాశ్రెడ్డి తదితరులు ఆయనతో నడిచే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.