టిడిపికి కెటిఆర్ కొత్త అర్థం: కెసిఆర్ను ఢీకొట్టి రేవంత్ రెడ్డి నిలిచేనా?
హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తీవ్ర సంక్షోభంలో మునిగింది. ఓవైపు వరుసగా ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోవడం, మరోవైపు పార్టీకి చెందిన ముఖ్య నేతలు సైకిల్ను విడిచి కారు ఎక్కడం ఆ పార్టీ కార్యకర్తలు, మిగిలి ఉన్న నేతలు జీర్ణించుకోవడం లేదు.
అయినప్పటికీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఎలాంటి ఢోకా లేదని, 2019లో తామే అధికారంలోకి వస్తామని, టిడిపిని ఎవరూ ఏం చేయలేరని తెలంగాణ టిడిపి ముఖ్య నేత రేవంత్ రెడ్డి చెబుతున్నారు. తెలంగాణలో టిడిపి నేతలకు, కార్యకర్తలకు అండగా ఉంటానని చంద్రబాబు కూడా పదేపదే చెబుతున్నారు.
అయితే, ఇటీవల పార్టీని కొందరు కీలక నేతలు వీడటాన్ని మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి నుంచి 15 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ఇప్పుడు ఉన్నది పదిమందే. అందులో ఆర్ కృష్ణయ్య టిడిపితో అంతగా కలిసి ఉండటం లేదు.
గ్రేటర్ ఎన్నికల తర్వాత.. ఎమ్మెల్యేలు వివేక్, ఎర్రబెల్లి దయాకర రావు, రాజేందర్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్ తదితరులు కారు ఎక్కారు. మరోవైపు, వరంగల్ లోకసభ ఉప ఎన్నికల్లో టిడిపి మద్దతిచ్చిన బిజెపి అభ్యర్థి, ఈ రోజు నారాయణఖేడ్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేదు.
వరంగల్ లోకసభ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్కు 6లక్షల పైచిలుకు ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి లక్షన్నర పై చిలుకు ఓట్లు రాగా, టిడిపి మద్దతిచ్చిన బిజెపి అభ్యర్థికి లక్షా ముప్పైవేల పై చిలుకు ఓట్లు మాత్రమే వచ్చాయి. గ్రేటర్ ఎన్నికల్లో టిడిపి పరిస్థితి అయితే మరీ దారుణం. హైదరాబాదులో 150 డివిజన్లలో ఒకే సీటుకు పరిమితమైంది. నారాయణఖేడ్ ఎన్నికల్లోను డిపాజిట్ దక్కించుకోలేకపోయింది.
ఇప్పటికే తెలంగాణలో టిడిపి పని ఖతమైందని, మిగిలిన నేతలు కూడా తెరాసనో, మరో పార్టీనో చూసుకోవడం ఖాయమని అంటున్నారు. అయితే, దీనిని రేవంత్ రెడ్డి, ఇతర నేతలు కొట్టి పారేస్తున్నారు. తాము తిరిగి పుంజుకుంటామని చెబుతున్నారు. నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లో టిడిపి డిపాజిట్లు కూడా దక్కించుకోకపోవడంపై మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ... టిడిపి అంటే 'తెలంగాణలో డిపాజిట్లు రాని పార్టీ' అని ఎద్దేవా చేశారు.