కలకలం: చర్లపల్లి జైలులో ఖైదీల మందు పార్టీ
హైదరాబాద్: నగరంలోని చర్లపల్లి జైలు మరోసారి వార్తల్లో నిలిచింది. ఇప్పటి వరకు జైలులోని ఖైదీలు ఘర్షణ పడటం, బయటివ్యక్తులనుంచి బిర్యానీలు తెప్పించుకుతినడం, ఖైదీల వద్ద సెల్ఫోన్లు దొరకడం వంటి సంఘటనలే జరిగాయి. కానీ, ఇప్పుడు ఏకంగా రిమాండ్లో ఉన్న ఓ ఖైదీయే తోటి ఖైదీలకు జైలులోనే మందుపార్టీ ఇచ్చిన సంగతి వెలుగులోకి వచ్చింది.
ఆదివారం ములాఖత్కు వచ్చిన కొందరు ఖైదీల బంధువులు ఈ విషయాన్ని బాహాటంగా చర్చించుకుంటుండంతో అసలు విషయం బయటపడింది. జైలులో రిమాండ్ ఖైదీకి మద్యం బాటిళ్ల సరఫరాపై ఆరా తీయగా జైలు సిబ్బందిలోనే ఇద్దరు.. ఖైదీ రమేష్ వద్ద రూ. 15వేలు తీసుకొని మూడు మద్యం బాటిళ్లు ఇచ్చినట్టు తెలిసింది.
మూడు నెలల క్రితం డ్రగ్స్ సరఫరా కేసులో అరెస్టయి, రిమాండ్లో ఉన్న రమేష్ గత కొంతకాలంగా మద్యం కోసం సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నాడని, ఈ క్రమంలో ఉద్యోగి ఒకరు అందుకు ఒప్పుకొని 15వేల రూపాయలకు మద్యం బాటిళ్లు ఇచ్చినట్టు సమాచారం.
సదరు ఉద్యోగి గతంలో కూడా ఇలా మద్యం బాటిళ్లు సరఫరా చేసినట్టు అభియోగాలు ఉన్నాయి. కాగా, మద్యం కోసం ఇచ్చిన డబ్బు ములాఖత్కు వచ్చే బంధువుల నుంచి తీసుకొని ఇచ్చినట్టు తెలిసింది.
సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను జనవరి 26న విడుదల చేస్తామని హోంమంత్రి చేసిన ప్రకటన నేపథ్యంలో జైలులోని ఖైదీకి మద్యం బాటిళ్లు సరఫరా చేసిన ఘటన విస్మయం కలిగిస్తోంది. ఈ విషయమై జైలు బారికేడ్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్రెడ్డిని ప్రశ్నించగా జైల్లో మద్యం బాటిళ్లు సరఫరా అయినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని, అవి వట్టి పుకార్లేనని వివరించారు.