మే 23కు రెడీ.. కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఆంక్షలు.. మద్యం దుకాణాలు క్లోజ్
హైదరాబాద్ : లోక్సభ ఎన్నికల తంతు ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ హడావిడి కూడా అయిపోయింది. ఇక మిగిలిందల్లా ఈవీఎంల్లో నిక్షిప్తమైన ప్రజల తీర్పు బయటకు రావడమే. ఆ మేరకు 23వ తేదీపై దేశవ్యాప్త దృష్టి కేంద్రీకృతమైంది. ఫలితాలు ఎప్పుడెప్పుడొస్తాయా అనే ఉత్కంఠ కనిపిస్తోంది.
వాట్ ఏ గలీజ్ దందా.. లిక్కర్ ప్రొడక్షన్లో రేషన్ బియ్యం..!
లోక్సభ ఎన్నికల కౌంటింగ్కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే అధికారులకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఆయా కేంద్రాల్లో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఎండాకాలం దృష్ట్యా కౌంటింగ్ కేంద్రాల్లో కూలర్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి కౌంటింగ్ కేంద్రం దగ్గర ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు సిద్ధం చేస్తున్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల దగ్గర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన పోలీస్ బలగాలను మోహరించారు.
కౌంటింగ్ నేపథ్యంలో బందోబస్తు పరంగా అన్నీ ఏర్పాట్లు చేశామని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. ఈసీ అధికారుల మార్గదర్శకాల ప్రకారమే భద్రతా ఏర్పాట్లను పూర్తి చేసినట్లు వెల్లడించారు. 23వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 24వ తేదీ ఉదయం 6 గంటల వరకు 144 సెక్షన్ కొనసాగుతుందని తెలిపారు.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కూడా ఆంక్షలు ఉంటాయని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. ఈనెల 23వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 24వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం అమ్మకాలపై నిషేధం విధించారు. ఆ మేరకు ఆయన ఉత్తర్వులు జారీ చేశారు.