ఓడినా గెలిచినా తన జీవితం ప్రజాసేవకే అంకితం అంటున్న కేసీఆర్ తనయ కవిత
నిజామాబాద్ లోక్సభ ఎన్నికల ఫలితాల్లో కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత ఓటమి పాలయ్యారు. ఊహించని ఈ పరిణామం టీఆర్ఎస్ శ్రేణుల్లో నిరుత్సాహం కలిగించింది. ఇక తాను నిజామాబాద్ లోక్ సభ ఎన్నికల్లో ఓటమి పాలవ్వడంపై టీఆర్ఎస్ నేత, కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత స్పందించారు. ఎన్నికల్లో ఓడినా, గెలిచినా తన జీవితం ప్రజలకే అంకితమన్నారు. తన కోసం పని చేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు అని పేర్కొన్నారు .
నిజామాబాద్ లో కేసీఆర్ తనయ కవిత ఓటమి .. కారణాలు ఇవేనా ?
ఐదేళ్ల పాటు సేవ చేసే అవకాశం ఇచ్చిన నిజామాబాద్ ప్రజలకు కృతజ్ఞతలు.. ఎన్నికల్లో గెలుపొందిన అర్వింద్కు శుభాకాంక్షలు.. నా గెలుపు కోసం శ్రమించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ కవిత ట్వీట్ చేశారు. ఇక తన జీవితం ప్రజాసేవకే అంకితం అని ఆమె పేర్కొన్నారు. పసుపు రైతులు పెద్ద సంఖ్యలో పోటీలో నిలిచిన నిజామాబాద్ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షించింది.
ఉత్కంఠభరితంగా సాగిన పోరులో కవితపై బీజేపీ అభ్యర్ధి ధర్మపురి అర్వింద్ 62 వేల పైచిలుకు ఓట్ల తేడాతో గెలుపొందారు. పసుపు రైతులు పెద్ద సంఖ్యలో బరిలోకి దిగటం , టీఆర్ఎస్ ఎలాగైనా విజయం సాధిస్తుంది అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ వెరసి కవిత ఓటమి పాలయ్యారు. సాక్షాత్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె ఓడిపోవడంతో రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా ఈ విషయం సంచలనంగా మారింది .