నా జీతం రూ.500, అందుకే ఎమ్మెల్యేల జీతాలు పెంచుతున్నాం: కెసిఆర్
హైదరాబాద్: తెలంగాణ ఎమ్మెల్యేల జీతాల పెంపు బిల్లుకు శాసన సభ మంగళవారం ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడారు. ఎమ్మెల్యేలు అవినీతిరహితంగా ఉండేందుకే జీతాలు పెంచుతున్నట్లు చెప్పారు.
తాను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు తన జీతం రూ.500 ఉండేదని చెప్పారు. తాను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు మొదటి అయిదు నెలలు తానే కారు నడుపుకున్నానని చెప్పారు. ఎమ్మెల్యేల జీతాల పెంపు పైన టీవీలలో చర్చ తనకు చాలా బాధ కలిగించిందని చెప్పారు.
బడ్జెట్తో పోల్చితో ఎమ్మెల్యేల జీతాల పెంపు పెద్ద భారం కాదని చెప్పారు. మాజీ ఎమ్మెల్యేల జీతాలను కూడా వంద శాతం పెంచామని చెప్పారు. కారు లోన్లను కూడా పెంచామని చెప్పారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి సలహా స్వీకరించిన ప్రభుత్వం
మార్కెట్ కమిటీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. శాసనసభలో మంత్రి హరీశ్ రావు మార్కెట్ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ సభ్యుడు చిన్నారెడ్డి ఇచ్చిన సూచనను ముఖ్యమంత్రి కెసిఆర్ స్వీకరించారు.
ఇందుకు అనుగుణంగా మార్కెట్ కమిటీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ సదుపాయాన్ని కల్పించనున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయంపై విపక్షాలు అందరూ హర్షం వ్యక్తం చేశాయి.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పెరిగిన జీతాలు ఇలా..
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతభత్యాలను ఒక్కసారిగా రూ.95 వేల నుంచి రూ.2.5 లక్షలకు (163%) పెంచేందుకు ప్రతిపాదించారు. ముఖ్యమంత్రికి ప్రస్తుతం ఉన్న జీతభత్యాల కంటే 72%.. శాసనసభాపతి, శాసనమండలి ఛైర్మన్లకు 70%.. మంత్రులు, చీఫ్ విప్, విప్లకు 65% మేర పెరగనున్నాయి.
మాజీ ఎమ్మెల్యేలు/ఎమ్మెల్సీలకు ప్రస్తుతం కనిష్ఠంగా రూ.15 వేలు, గరిష్ఠంగా రూ.25 వేలు చొప్పున ఇస్తున్నారు. దీనిని కనిష్ఠ పింఛను రూ.30 వేలకు, గరిష్ఠ పింఛను రూ.50 వేలు చేయాలని ప్రతిపాదించారు.
ఒకసారి ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా పనిచేసిన వారికి రూ.30 వేలు, రెండుసార్లు గెలిచి మాజీ అయితే రూ.35 వేలు, మూడుసార్లు పనిచేసిన వారికి రూ.40 వేలు, నాలుగుసార్లు పనిచేసిన వారికి రూ.45 వేలు, ఐదుసార్లు ఎన్నికైన మాజీలకు రూ.50 వేలు చొప్పున పెన్షన్ చెల్లించనున్నారు.
మాజీ చట్టసభ్యులు ఎవరైనా మరణిస్తే, వారి భార్య/భర్తకు కూడా ఇకపై అంతే మొత్తాన్ని పెన్షన్గా అందించనున్నారు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి మరణిస్తే పెన్షన్లో సగం మాత్రమే వారి భార్య/భర్తకు ఇచ్చేవారు. తాజా ప్రతిపాదనతో వారికి పూర్తి పింఛను అందుతుంది.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీల ఆరోగ్య బీమా పరిమితిని రూ.5 లక్షల వరకు పెంచాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీనికి సంబంధించి జీవో ఇవ్వనుంది. వాహన రుణ పరిమితిని రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచనుంది.
జీతం, అలవెన్సులు కలిపి ముఖ్యమంత్రి జీతం రూ.4.21 లక్షలు, స్పీకర్, మండలి చైర్మన్కు రూ.4.11 లక్షలు, మంత్రులకు, చీఫ్ విప్, విప్లకు రూ.4 లక్షలు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు రూ.2.5 లక్షలు రానున్నాయి.