మమత ఎపిసోడ్లో కేసీఆర్ ఎందుకు దూరంగా ఉన్నారు..గులాబీ బాస్ మనసులో ఏముంది..?
ఓ వైపు యునైటెడ్ ఫ్రంట్ మరోవైపు ఫెడరల్ ఫ్రంట్... యునైటెడ్ ఫ్రంట్లో బీజేపీయేతర పార్టీలు ఉండగా.. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్లో బీజేపీ కాంగ్రెస్యేతర పార్టీలకు వ్యతిరేకంగా ఏర్పాటు అవుతోంది. మమతా బెనర్జీతో మంచి సంబంధాలు ఉన్నాయని చెబుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్... మమతా బెనర్జీ సీబీఐల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. మరోవైపు మమతా బెనర్జీకి బీజేపీయేతర పార్టీల నుంచి మద్దతు లభిస్తోంది.
ప్రస్తుతం పార్లమెంటును కుదిపేస్తోన్న మమత వర్సెస్ సీబీఐ అంశం నుంచి టీఆర్ఎస్ ఎంపీలు దూరంగా ఉండాలని గులాబీ బాస్ సూచించినట్లు సమాచారం. ఇప్పటికే మమతా బెనర్జీకి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏపీ సీఎం చంద్రబాబు, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతిల నుంచి మద్దతు లభించింది. అయితే ఇక్కడ మరోసారి కేసీఆర్ ఒంటరయ్యారు. మమతా బెనర్జీ కోల్కతా నిర్వహించిన ఐక్యవేదిక ర్యాలీకి కేసీఆర్ గైర్హాజరు కాగా.. ఇప్పుడు మళ్లీ మమతకు అండగా నిలవడంలేదనే సంకేతాలు పంపకనే పంపారు.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ బీజేపీ లేని ఫెడరల్ ఫ్రంట్ కోసం కేసీఆర్ పాటుపడుతుండటంతో... మమత ర్యాలీకి కాంగ్రెస్ కూడా హాజరయ్యింది. తెలంగాణలో రెండో సారి అధికారంలోకి వచ్చాక తన ప్రయత్నాలను పునఃప్రారంభించిన కేసీఆర్... ముందుగా మమతా బెనర్జీని వెళ్లి కలిశారు. తన ఆలోచన గురించి చెప్పారు. అయితే మమతా దగ్గర నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ రాలేదు. ఇక మమతా ర్యాలీకి గైర్హాజరైన బిజుజనతాదల్ పార్టీ కూడా ప్రస్తుతం జరుగుతున్న మమత వర్సెస్ సీబీఐ యుద్ధంలో మమతకు అండగా నిలిచారు. అంతేకాదు మమతకు మద్దతుగా ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ కోల్కతాకు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం సీబీఐని దుర్వినియోగం చేస్తోందని నవీన్ పట్నాయక్ నిప్పులు చెరిగారు.
మొత్తానికి సీబీఐని నరేంద్ర మోడీ దుర్వినియోగం చేస్తున్నారంటూ ధ్వజమెత్తుతున్న దీదీకి మద్దతుగా మరోసారి అన్ని పార్టీలు ఏకతాటిపైకి రావడంతో దేశంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయనే సంకేతాలు వెలువడుతున్నాయి. మరి అందరూ ఓవైపు ఉంటే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో ఉన్న కేసీఆర్ ఎలాంటి ముందడుగు వేస్తారో వేచిచూడాలి.