జీఎస్టీ పేరుతో వినియోగదారులకు విద్యుత్ వాత ..సామాన్యుల నడ్డి విరిచేలా బిల్లుల మోత
విద్యుత్ శాఖ వినియోగదారులకు షాక్ వ్వటం మాత్రం మరచిపోలేదు . కరెంట్ బిల్లు రూ.523 వస్తే దానికి జీఎస్టీ, డీసీలు కలిపి మొత్తం బిల్లు రూ.4,432లు చెల్లించాల్సిందే అని విద్యుత్తు సిబ్బంది ఓ వినియోగదారుడికి బిల్లు చేతిలో పెట్టారు . ఇక ఆ బిల్లు చూసిన వినియోగదారుడు షాక్ కు గురయ్యాడు. నేను వాడుకున్న కరెంట్ కు రూ.523 బిల్లే కదా వచ్చింది, ఇదంతా ఎందుకు చెల్లించాలి అని ప్రశ్నిస్తే కచ్చితంగా చెల్లించాలి అని చెప్పటంతో ఖంగు తిన్నాడు ఆ వినియోగదారుడు .
వినియోగదారుడికి బిల్లు బాదుడు ... లబోదిబోమంటున్న వినియోగదారుడు
ఇక అసలు విషయానికి వస్తే సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం చిన్ననెమిల క్రాస్రోడ్డుకు చెందిన వెంకన్న మార్చి మాసానికి 54 యూనిట్ల విద్యుత్ వినియోగించారు. వినియోగించిన విద్యుత్ కు రూ.523 మాత్రమే బిల్లు ఇవ్వాలి కానీ విద్యుత్ శాఖాధికారులు డెవల్పమెంట్ చార్జీ, జీఎస్టీ కింద రూ.4,432 అదనంగా బిల్లు ఇవ్వటంతో ఆయన లబోదిబోమంటున్నారు .
5 ఏళ్ళ క్రితం పెట్టిన మీటరుకు అప్పటి నుండి జీఎస్టీనా.. ఇదెక్కడి న్యాయం
అదనంగా వేసిన చార్జీల గురించి ప్రశ్నిస్తే వెంకన్న ఇంట్లో ఐదేళ్ల క్రితం డిజిటల్ విద్యుత్తు మీటర్ అమర్చారు. సర్వీస్ నెం.4200400310 . అతడు కొంతకాలం కూల్డ్రింక్ దుకాణం నడపడంతో కనెక్షన్ కేటగిరీ-2లోకి మారింది. ఆ తరువాత దుకాణం తీసేసినా కేటగిరీ మాత్రం మారలేదు. ఇక తాజాగా ఇచ్చిన బిల్లు 5 ఏళ్ళ క్రితం పెట్టిన కొత్త మీటర్కు డెవలప్మెంట్ చార్జీ అని , మీటర్ బిగించిన నాటి నుంచి జీఎస్టీ అమలవుతుందని అధికారులు చెబుతున్నారు.
కరెంట్ వాడకం మూరెడు అయినా బిల్లు మాత్రం బారెడు .. సామాన్యుల నడ్డి విరుస్తున్న కరెంట్ బిల్స్
అయితే ఐదేళ్లక్రితం బిగించిన మీటర్కు ఇప్పుడు డెవల్పమెంట్ చార్జీ, జీఎస్టీ ఒకేసారి వసూలు చేయడమేంటని వెంకన్న ప్రశ్నిస్తున్నా ఫలితం లేకుండా పోయింది. బిల్లు కట్టాల్సిందే లేదంటే కరెంట్ కట్ చేస్తామని కరెంట్ అధికారులు చెప్పిమరీ వెళ్ళారు . ఇక కరెంట్ వాడకాన్నిబట్టి కరెంట్ బిల్లు వచ్చింది మూరెడు అయితే , జీఎస్టీ పేరుతో డెవలప్మెంట్ చార్జీల పేరుతో వేసిన బిల్లు బారెడుగా వుందని, సామాన్యుల నడ్డి విరిచేలా కరెంట్ బిల్లులు వస్తున్నాయని సదరు వినియోగదారుడు లబోదిబోమంటున్నాడు.