వైద్యం కోసం వెళ్తే మహిళపై గ్యాంగ్రేప్ చేసిన ఉస్మానియా ఆస్పత్రి సిబ్బంది
హైదరాబాద్: నగరంలో జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వైద్యం కోసం ఉస్మానియా ఆసుపత్రికి వచ్చిన ఓ మహిళపై ఆస్పత్రి సిబ్బందే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
అఫ్జల్గంజ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ సమీపంలోని హీరానగర్ బస్తీకి చెందిన ఓ మహిళ (35) మే 2న భర్తతో గొడవపడింది. భర్త ఆమెను కొట్టడంతో అదే రోజు రాత్రి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
వైద్యం కోసం ఉస్మానియా ఆస్పత్రికి..
ఎస్కార్టుగా మహిళా పోలీసులను ఆమె వెంట పంపించాల్సిన పోలీసులు, అలా చేయకుండా.. మెడికో లీగల్ కేసు నమోదు చేయాలని ఉస్మానియా వైద్యాధికారులకు లేఖ రాసి ఆమె చేతికే ఇచ్చి పంపించారు. ఈ క్రమంలో చికిత్స నిమిత్తం ఉస్మానియాకు వచ్చిన ఆమెను అత్యవసర చికిత్సా విభాగంలో విధులు నిర్వర్తించే వార్డు బాయ్.. వైద్యం చేయించడంతోపాటు ఆమె భర్తపై కేసు నమోదు చేయిస్తానంటూ నమ్మించాడు.
సామూహిక అత్యాచారం
వైద్యం చేయించిన అనంతరం వార్డు బాయ్, ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్, అఫ్జల్గంజ్ పోలీసు అవుట్పోస్టుకు చెందిన హోంగార్డు కలిసి తనను ఓపీ భవనం మొదటి అంతస్తులోకి తీసుకువెళ్లి సామూహిక అత్యాచారం చేశారని బాధితురాలు వాపోయింది. ఈ మేరకు మరుసటి రోజు తెల్లవారుజామున ఉస్మానియా ప్రధాన గేటు దగ్గరున్న కానిస్టేబుల్ సాయంతో బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది.
న్యాయవాది సాయంతో..
అత్యాచారం జరిగిన ప్రాంతం అఫ్జల్గంజ్ పోలీసు స్టేషన్ పరిధిలోనికి వస్తుందని బంజారాహిల్స్ పోలీసులు ఆమెను పంపించేశారు. అనంతరం తను పని చేసే ఇంట్లో న్యాయవాది సహాయంతో బాధితురాలు శుక్రవారం అఫ్జల్గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
నిందితుడిపై కేసు నమోదు
ఉస్మానియాలోని అత్యవసర విభాగం, ప్రధాన ప్రవేశమార్గం, రెండో అంతస్తులో ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. రాత్రి విధుల్లో ఎంత మంది సిబ్బంది ఉన్నారని ఆరా తీశారు. ఉస్మానియా వార్డుబాయ్ నాగరాజుపైనే బాధితురాలు ఫిర్యాదు చేసిందని, అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అఫ్జల్గంజ్ ఎస్సై సైదులు తెలిపారు.