సెక్రటేరియట్ లో మహిళ ఆత్మహత్యా యత్నం! ఏం జరిగింది?
హోం మంత్రిని కలిసి తన సమస్య చెప్పుకోవాలని తెలంగాణ సెక్రటేరియట్ వచ్చిన ఆర్. స్వప్న అనే మహిళ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలవలేకపోవడంతో చివరికి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
హైదరాబాద్ : తెలంగాణ సెక్రటేరియట్లో మాత్రలు మింగి ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చిలకలగూడ పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న సాయికుమార్ భార్యగా చెప్పుకుంటున్న ఆర్. స్వప్న హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలిసేందుకు శుక్రవారం సెక్రటేరియట్కు వచ్చింది.
అయితే సిబ్బంది అనుమతించకపోవడంతో ఆమె బలవన్మరణానికి యత్నించింది. వెంటనే అక్కడ ఉన్న పోలీసులు ఆమెను మాక్స్క్యూర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సాయికుమార్ సస్పెన్షన్ లో ఉన్నారు.
తన భర్త సస్పెండ్ అయినప్పటి నుంచి తనను మానసికంగా వేధిస్తున్నారని హోం మంత్రికి ఫిర్యాదు చేసేందుకు స్వప్న సెక్రటేరియట్ కు వచ్చింది. అయితే ఆమె ఏ ట్యాబ్లెట్ మింగలేదని, కేవలం స్పృహ తప్పి పడిపోయిందని అక్కడి సిబ్బంది వాపోయారు. మరోవైపు ఈ ఘటనపై నగర పోలీస్ కమిషనర్ విచారణకు ఆదేశించారు.
తూర్పుగోదావరి జిల్లా నుంచి బతుకుదెరువు కోసం హైదరాబాద్కు వచ్చిన స్వప్న ఇళ్లల్లో పనిచేసేదని పోలీసుల విచారణలో తేలింది. 14 ఏళ్ల వయసులో ఆమెకు పెళ్లి అయి ఓ కొడుకు కూడా ఉన్నట్లు గుర్తించారు.
భర్తతో విభేదాలతో కానిస్టేబుల్ సాయికుమార్కు ఆమె దగ్గరైంది. అతనితో నాలుగేళ్ల నుంచి పరిచయం ఉన్నట్లు పోలీసుల విచారణలో తెలిసింది. పెళ్లి చేసుకొని తనతో నాలుగేళ్లు కాపురం చేశాడని, ఇప్పుడు వేరే యువతిని పెళ్లి చేసుకున్నాడని స్పప్న ఫిర్యాదు చేసింది.
అయితే సాయి కుమార్కి ఇదివరకే పెళ్లి అయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్లాన్ ప్రకారం ఇద్దరూ ఒకరినొకరు మోసం చేసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.