నాలుగు పెళ్లిళ్ల నిత్య వధువుపై పిడి యాక్ట్ నమోదు
హైదరాబాద్: తాను జాయింట్ కలెక్టర్నంటూ నమ్మించి మోసాలకు పాల్పడిన మహిళపై పోలీసులు పిడీ యాక్ట్ కేసు నమోదు చేశారు. హైదరాబాదులోని ఎస్ఆర్ నగర్ ఇన్స్పెక్టర్ జివి. రమణగౌడ్ అందుకు సంబంధించిన వివరాలను అందించారు.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన తాండ్ర హేమ అలియాస్ శైలు అలియాస్ రాణి అలియాస్ బుజ్జి అలియాస్ అలేఖ్యా రెడ్డి అలియాస్ హేమలత బతుకు దెరువు కోసం హైదరాబాద్ వచ్చి సరూర్నగర్లో నివాసం ఉంటూ వచ్చింది. కూలీ పని చేసుకునే ఆమె ఎల్బీ నగర్కు చెందిన రవీంద్రను పెళ్లి చేసుకుంది.
కొద్దికాలం పాటు అతనితో కాపురం చేసి ఇద్దరు పిల్లలకు జన్న ఇచ్చింది. అయితే తనను భర్త వేధిస్తున్నాడంటూ హేమ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత మోతీనగర్, బోరబండ ప్రాంతానికి వచ్చిన జగదీష్ అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుని అతనిపై కూడా కేసు పెట్టింది.
ఆ తర్వాత పూర్ణచంద్ అనే వ్యక్తిని మూడో పెళ్లి చేసుకుని అతనిపైనా కేసు పెట్టింది. చివరగా కరీంనగర్కు చెందిన కిశోర్ అనే వ్యక్తిని నాలుగో వివాహం చేసుకుంది. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేస్తున్నానని పలువురిని పరిచయం చేసుకని మోసం చేసింది.
ప్రభుత్వోద్యోగాలు ఇప్పిస్తానని చాలా మంది నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. చివరగా ఆస్తి కోసం బంధువులు తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వచ్చింది. దీంతో ఆమెను ఫిబ్రవరి 11వ తేదీన ఎస్ఆర్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. అయితే, తాజాగా ఆమెపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేశామని ఇన్స్పెక్టర్ తెలిపారు. ఎల్బీనగర్, ఎస్ఆర్ నగర్, జూబ్లీహిల్స్ స్టేషన్లలో ఆమెపై ఏడు కేసులున్నాయి.