ఘోరం: విద్యుత్ తీగలు తెగి కారుమీద పడి.. మహిళ సజీవ దహనం
విద్యుత్ తీగలు తెగి పడి కారు దగ్ధమైన ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే సజీవ దహనం కాగా ఓ యువకుడు ప్రాణాలకు తెగించి కాపాడడంతో కారులో ఉన్న ఐదుగురు ప్రాణాలతో బయటపడిన ఉదంతమిది.
హైదరాబాద్: విద్యుత్ తీగలు తెగి పడి కారు దగ్ధమైన ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే సజీవ దహనం కాగా ఓ యువకుడు ప్రాణాలకు తెగించి కాపాడడంతో కారులో ఉన్న ఐదుగురు ప్రాణాలతో బయటపడిన ఉదంతమిది.
శుక్రవారం రాత్రి రంగారెడ్డి జిల్లా యాచారం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. కృష్ణా జిల్లా విసన్నపేట మండలం కలగర గ్రామానికి చెందిన చిలకాని జితేందర్కుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది.
రాత్రి 7 గంటల సమయంలో కూకట్పల్లి నిజాంపేట్ నుంచి కారులో యాచారం మండలంలోని నక్కర్తమేడిపల్లి- తక్కళ్లపల్లి గ్రామాల మధ్యన ఉన్న ఎస్ఆర్ హేచరీస్లోని తమ బంధువుల వద్దకు వీరు వెళుతున్నారు.
ప్రమాదం జరిగిన సమయంలో కారులో జితేందర్కుమార్ , అతని భార్య చంద్రకళ(40), కుమారుడు వృథ్వీ,తోపాటు చంద్రకళ తల్లి ఆరేపల్లి పద్మావతి, జితేందర్ కుమార్ అక్క కలకొండ శ్రీ విద్య, ఆమె కుమారుడు కలకొండ సూర్యవిహర్లు ఉన్నారు.
వీరి కారు ముందు ఇనుపచువ్వల లోడుతో ఒక లారీ వెళుతోంది. నాగార్జునసాగర్- హైదరాబాద్ రహదారిపై యాచారం తహసీల్దార్ కార్యాలయం వద్దకు రాగానే ముందు లారీలోని ఇనుపచువ్వ ఒకటి రోడ్డుపై అడ్డంగా ఉన్న విద్యుత్ తీగలకు తగిలింది. దీంతో ఆ విద్యుత్ తీగ తెగి వెనక వస్తున్న జితేందర్ కుమార్ కారుపై పడింది.
దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో భయాందోళనకు గురైన చంద్రకళ సడన్గా కారు డోర్ తీసి కాలు కింద పెట్టగానే ఆమెకు మంటలు అంటుకున్నాయి. దీంతో ఆమె అక్కడికక్కడే సజీవ దహనమైంది. అదే సమయంలో ఆర్టీసీ బస్సులో మాల్ వైపునకు వెళ్తున్న మాడ్గుల మండలం నాగిళ్ల గ్రామానికి చెందిన పల్లేటి జగన్ ఇది గమనించి పరుగుపరుగున అక్కడికి వచ్చాడు.
మంటలను కూడా లెక్క చేయక ప్రాణాలకు తెగించి తన వద్ద ఉన్న దుస్తులతో కారు డోర్లు తీశాడు. వెంటనే జితేందర్కుమార్, పృథ్వీ, పద్మావతి, శ్రీ విద్య, సూర్యవిహర్ ప్రాణాలతో బయటపడ్డారు.
కొన్ని నిమిషాల్లో చేరుకుంటారనగా...
ప్రమాదం జరగడానికి కొన్ని నిమిషాల ముందు వరకు కూడా చంద్రకళ తమ బంధువులతో ఫోన్లో మాట్లాడిన్లట్లు తెలిసింది. మరి కొద్ది సేపట్లోనే మీ వద్దకు వస్తున్నామని ఆమె ఫోన్ లో చెబుతుండగానే విద్యుత్ తీగల రూపంలో మృత్యువు ఆమెను కబళించింది.
రోడ్డు మధ్యలోనే కారు దగ్ధం కావడంతో రోడ్డుకిరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. చంద్రకళ మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
సంఘటన స్థలాన్ని ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డి సందర్శించి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. ఎస్ఆర్ హచరీస్ మేనేజన్ మనోహర్రెడ్డి ద్వారా ప్రమాదానికి గురైన కుటుంబీకుల వివరాలు తెలుసుకున్నారు. ప్రాణాలకు తెగించి డోర్లు తీసి ఐదుగురి ప్రాణాలను కాపాడిన పల్లేటి జగన్ను ఏసీపీ అభినందించారు.