రాజీనామా చేయకుంటే ఆత్మహత్య!: తెరాస ఎమ్మెల్యేకు యువతి షాక్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి నేత, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతకు ఓ యువతి షాకిచ్చింది. ఎమ్మెల్యే రాజీనామా చేయాలని లేదంటే తాను ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇటీవల కొత్త జిల్లాల ఏర్పాటులో గుండాల మండలం జనగాంలో కలిసింది.
అయితే, ఇది ఇప్పుడు సునీతకు చిక్కులు తెచ్చిపెట్టిందని వార్తలు వస్తున్నాయి. గుండాల మండలాన్ని జనగాం జిల్లాలో కలపడంతో తమ ఉద్యోగావకాశాలు దెబ్బతిన్నాని, ఈ మండలాన్ని జనగాం జిల్లాలో ఎలా కలిపారని ఓ యువతి ఆమెను రెండు రోజుల క్రితం ఫోన్లో ప్రశ్నించిందట.
తాను కలపలేదని, ముఖ్యమంత్రి కలిపారని, ఏమైనా అడగాలనుకుంటే ఆయననే అడగాలని దానికి ఎమ్మెల్యే సమాధానం ఇచ్చారని, దీంతో ఆ యువతి ఓట వేసి గెలిపిస్తే కేసీఆర్ను అడగమని చెప్పడం ఏమిటని నిలదీసిందని తెలుస్తోంది. అలా మీరు చెప్పకుంటే వెంటనే రాజీనామా చేయాలని లేదంటే నేను ఆత్మహత్య చేసుకుంటానని సదరు యువతి హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. దానికి ఎమ్మెల్యే సునీత కూడా నన్ను బెదిరిస్తున్నావా అని చెప్పి ఫోన్ పెట్టేసిందట.
ఆ తర్వాత 'మన గుండాల' అనే వాట్సాప్ గ్రూప్కు సందేశం కూడా పెట్టింది. దీంతో ఎమ్మెల్యే గొంగిడి సునీత విషయాన్ని జనగాం పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.
ఆ యువతిని స్వప్నగా గుర్తించారు. పోలీసులు ఆమెను కలుసుకున్నారు. పోరాటం చేయాలని తప్ప ఆత్మహత్య పరిష్కారం కాదని వారు నచ్చ చెప్పారు. కాగా, గుండాల మండలాన్ని యాదాద్రి భువనగిరిలో కాకుండా జనగాంలో చేర్చడంపై తొలి నుంచి నిరసన వ్యక్తమవుతోంది.