భర్త అఫైర్: పిల్లలను బావిలోకి తోసి తాను దూకి భార్య ఆత్మహత్య
వనపర్తి: కుటుంబ తగాదాల కారణంగా ముగ్గురు ప్రాణాలు తీసుకున్నారు. భర్త వివాహేతర సంబంధం వల్ల విసిగిపోయి గొడవ పడిన మహిళ చివరకు ఇద్దరు పిల్లలను బావిలోకి తోసి తాను దూకి ఆత్మహత్య చేసుకుంది.
మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన వడ్డె యశోద (35) మంగళవారం సాయంత్రం పొలానికి వెళ్లింది. తనతో పాటు తన పిల్లలు ఆంజనేయులు (10), భాగ్యలక్ష్మి (4)లను తీసుకుని వెళ్లింది.
అక్కడ పిల్లలను బావిలోకి తోసి తానూ దూకి ఆత్మహత్య చేసుకుంది. తల్లి, తమ్ముడు, చెల్లెలు కన్పించక పోవడంతో పెద్ద కొడుకు చంద్రశేఖర్ ఆందోళన చెంది హైదరాబాద్లో ఆటో నడిపే తండ్రి సత్తయ్యకు ఫోన్ చేసి చెప్పాడు.
బుధవారం ఉదయం బావిలో ముగ్గురి శవాలు తేలాయి. సత్తయ్యకు ఉన్న వివాహేతర సంబంధాల వల్ల ఇంట్లో తరుచుగా గొడవలు జరుగుతూ వచ్చాయి. దీంతో మనస్తాపం చెందిన యశోద ఆ తీవ్రమైన చర్యకు ఒడిగట్టినట్లు చెబుతున్నారు.
మహబూబ్నగర్ రూరల్ సీఐ పార్థసారథి సంఘటనా స్థాలానికి చేరుకొని వివరాలను తెలుసుకున్నారు.