ఇంకెప్పుడూ తిట్టను.. నన్ను క్షమించు!: కాబోయే భర్తపై మనస్తాపంతో ఆత్మహత్య..
కాబోయే భర్త తనతో సరిగా మాట్లాడటం లేదన్న కారణంతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది.
హైదరాబాద్: కాబోయే భర్త తనతో సరిగా మాట్లాడటం లేదన్న కారణంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. సికింద్రాబాద్ పరిధిలోని జేమ్స్ స్ట్రీట్ రైల్వే స్టేషన్ వద్ద ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలిని పొద్దుటూరు నుంచి నగరానికి వలస వచ్చిన అనిత(23)గా గుర్తించారు.
పోలీసుల కథనం ప్రకారం.. విజయనగరం జిల్లా బాడంగి మండలానికి చెందిన సీతమనాయుడు, మంగ కుమార్తె అనిత(23) పొద్దుటూరులో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది. చదువుకునే సమయంలో కార్తీక్ అనే యువకుడితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇరు కుటుంబాల అంగీకారంతో రెండేళ్ల క్రితం వీరికి నిశ్చితార్థం కూడా జరిగింది.
ఇదే క్రమంలో ఏడాది క్రితం యువతి తండ్రి చనిపోవడంతో.. ఆమె కుటుంబం పొద్దుటూరు నుంచి హైదరాబాద్ వలస వచ్చింది. నగరంలోని గాంధీనగర్ లో బంధువులతో కలిసి వారు ఉంటున్నారు. అనిత నగరంలోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తోంది. ఈ నెల 17న కార్తీక్ తో మాట్లాడాలని అతనికి ఫోన్ చేసింది.
కార్తీక్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అతని నంబర్ బ్లాక్ లిస్టులో పెట్టింది. అదే రోజు రాత్రి 8గం. సమయంలో తిరిగి అతనికి ఫోన్ చేసింది. రెండు మూడుసార్లు ప్రయత్నించాక గానీ అతను ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన అనిత.. 'అనవసరంగా కోప్పడ్డాను.. ఇక నిన్నెప్పుడూ తిట్టను.. అందుకు అవకాశమే ఉండదు, నన్ను క్షమించు' అంటూ ఫోన్ పెట్టేసింది.
వెంటనే కార్తీక్ తిరిగి అనితకు ఫోన్ చేసినా ఆమె మాత్రం స్పందించలేదు. అతనితో ఫోన్ సంభాషణ అనంతరం జేమ్స్ స్ట్రీట్ లోకల్ రైల్వే స్టేషన్ వద్ద గుర్తు తెలియని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి ఆచూకీ తెలియకపోవడంతో.. మార్చురీకి ఆమె మృతదేహాన్ని తరలించారు. గురువారం ఉదయం ఆమె కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు.