తెల్లారేసరికే ఫ్యానుకు వేలాడుతూ..: పెళ్లయిన కొద్దిరోజులకే నవ వధువు ఆత్మహత్య?
కాగజ్నగర్: అదనపు కట్నం వేధింపులు ఓ నవ వధువును బలితీసుకున్నాయి. కాళ్ల పారాణి కూడా ఆరకముందే కన్నబిడ్డ విగతజీవిగా మారడం ఆ తల్లిదండ్రుల గుండెలు పిండేసింది. భర్త, అత్తమామలు పెట్టిన వేధింపులు తాళలేక ఆ యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే భర్తే ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.
ఈ నెల 9న వివాహం:
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం ధర్మారావు పేట గ్రామానికి చెందిన మెరుగు గట్టయ్య, లక్ష్మిల రెండో కుమార్తె మానస అలియాస్ అరుణ(19), కాగజ్నగర్ మండలం జంబుగా గ్రామానికి చెందిన బుస దుర్గక్క, నానయ్యల కుమారుడు రాజేశ్(23)లకు ఈ నెల 9న వివాహం జరిగింది. పెళ్లి సందర్భంగా వధువు కుటుంబ సభ్యులు రూ.3లక్షలు వరకట్నం కూడా ఇచ్చారు.
పెళ్లయిన కొద్దిరోజులకే..:
పెళ్లి సమయంలో కట్నం ఇచ్చినా.. ఆపై కొద్దిరోజులకే అరుణకు అదనపు కట్నం వేధింపులు మొదలయ్యాయి. అదనపు కట్నం కోసం భర్త రాజేశ్ ఆమెను వేధించాడు. నాలుగు రోజుల క్రితం పుట్టింటికి వెళ్లిన అరుణ.. ఇదే విషయాన్ని తల్లిదండ్రులతో చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది. అయినప్పటికీ తల్లిదండ్రులు ఆమెకు నచ్చజెప్పారు. అత్తింటివారితో మాట్లాడుతామని చెప్పి భర్త వద్దకు పంపించారు.
తెల్లారేసరికే ఫ్యానుకు వేలాడుతూ..:
ఆదివారం రాత్రి అరుణ సీలింగ్ ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే ఘటన తీరు మాత్రం పలు అనుమానాలకు తావిస్తోందంటున్నారు. ఆదివారం రాత్రి రాజేశ్-అరుణ ఇద్దరు కలిసి ఒకే గదిలో పడుకున్నారని, తెల్లారేసరికి అరుణ ఫ్యానుకు వేలాడుతూ కనిపించిందని చెబుతున్నారు. అరుణ ఫ్యానుకు ఉరేసుకున్నప్పటికీ.. అది కొంచెమైనా వంగి లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
భర్తే చంపాడని ఆరోపణలు:
అరుణను భర్తే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసులు సైతం ఇదే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అరుణ భర్త రాజేశ్, అత్త దుర్గక్క, ఆడపడుచు అన్నమ్మ, బావ మల్లేష్ లపై కేసు నమోదు చేశారు. పోస్టుమార్టమ్ నివేదిక వస్తే అరుణ మృతికి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.